ఎప్పుడూ కామెంట్ కు వెనుకాడని స్వామి! జీఎస్టీపై మాత్రం..
న్యూఢిల్లీ : వ్యక్తిగత అభిప్రాయాలను వెలువరించే క్రమంలో కొన్ని సార్లు పార్టీ మార్గదర్శకాలకు తలొగ్గి కామెంట్స్ చేయాల్సిన అనివార్యత స్థితి రాజకీయాల్లో ఉంటుంది. తమ వ్యాఖ్యలు పార్టీ అనుసరిస్తున్న తీరుకు ఏమాత్రం విఘాతం కలిగించినా..! మొదటికే మోసం వస్తుంది కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో మౌనాన్నే ఆశ్రయిస్తుంటారు చాలామంది నేతలు.
తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యవహరిస్తోన్న తీరు కూడా ఇదే పరిస్థితిని తలపిస్తోంది. ప్రతీ విషయంపై తనదైన మార్క్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో హైలైట్ గా నిలిచే సుబ్రహ్మణ్య స్వామి తాజా జీఎస్టీ బిల్లు విషయంలో మాత్రం నోరు మెదకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనిపై సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్నారు.
ట్విట్టర్ ద్వారా జీఎస్టీ బిల్లుపై స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి.. దేశానికి జీఎస్టీ అవసరం ఏ మేర ఉందనే అంశంపై ఎవరైనా అధ్యయనం చేశారా అంటూ తొలుత ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ బిల్లుపై మీ అభిప్రాయాలను ఎందుకు వ్యక్తపరచడం లేదని ప్రశ్నించారు. దీంతో 'నా ఆర్థికశాస్త్ర ప్రావీణ్యం, పార్టీ విధేయత పట్ల ఘర్షణకు దారి తీసే అవకాశముండడంతోనే నేను మౌనంగా' ఉంటున్నాని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్య స్వామి.
పెట్టుబడులు పెరగడం.. కార్మిక ఉత్పాదక శక్తి పెరగడం ద్వారానే దేశ జీడీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డ సుబ్రహ్మణ్య స్వామి.. మొత్తానికి తన వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇబ్బందికి గురిచేస్తాయని పరోక్ష వ్యాఖ్యలు చేశారన్న చర్చ నడుస్తోంది.