అహంకారం, అలా చేస్తే తిప్పేయొచ్చు: బీజేపీ ఓటమిపై సుబ్రహ్మణ్యస్వామి, అభివృద్ధి చేసినా.. చంద్రబాబు పేరు
న్యూఢిల్లీ: 4లోకసభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికరంగా స్పందించారు. దానికి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు, కొందరు నెటిజన్లు చేసిన ట్వీట్ను ఆయన రీట్వీట్ కూడా చేశారు. అవి ఆసక్తికరంగా ఉన్నాయి.
బీజేపీకి కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ: ఉపఎన్నిక గెలుపుతో సీన్ రివర్స్, మేఘాలయలో కర్ణాటక రిపీట్?
ఉప ఎన్నికల్లో బీజేపీ యూపీలోని కీలక కైరానా స్థానాన్ని కోల్పోయింది. ఆరు పార్టీలు కలిసి బీజేపీపై ఆర్ఎల్డీ అభ్యర్థిని నిలబెట్టాయి. దీంతో బీజేపీకి 3,50 లక్షల ఓట్లు రాగా, ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుంకు 4 లక్షల ఓట్లు వచ్చాయి. అదే రాష్ట్రంలో నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.
బీజేపీ ఓటమికి దురహంకారం కారణం
ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణం దురహంకారమని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్రధానమైన వారికి అనుకూలంగా ఉండటం పక్కన పెడితే ప్రస్తుత ఫలితాలు రివర్స్ అవుతాయని అభిప్రాయపడ్డారు. తద్వారా అలాంటి వాటిని పక్కన పెడితే బీజేపీ తిరిగి పుంజుకుంటుందన్నారు.
మళ్లీ తిప్పేయవచ్చు
ప్రజల నమ్మకం పొందిన నేతల మధ్య మరింత ఎక్కువగా భాగస్వామ్య నిర్ణయీకణ లక్షణాలు ఉంటే, ఈ ధోరణిని (ఓటమి చెందడాన్ని) సులభంగా వెనక్కి తిప్పవచ్చునని చెప్పారు. మళ్లీ గెలుపొందేందుకు బీజేపీకి తగిన వనరులు ఉన్నాయన్నారు. కానీ అందుకు నూతన విధానాలు అవసరమని చెప్పారు.
యూజర్ నేమ్, పాస్ వర్డ్ హిందుత్వ
రాహుల్ అనే వ్యక్తి స్వామి ట్వీట్పై స్పందించగా దానిని సుబ్రహ్మణ్య స్వామి రీట్వీట్ చేశారు. అందులో ఏముందంటే.. అభివృద్ధి చేసినప్పటికీ ఓడిపోయిన నేతలు ఉన్నారని పేర్కొన్నారు. అందులో మొరార్జీ దేశాయ్, పీవీ నర్సింహా రావు, అటల్ బిహారీ వాజపేయి, ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు అని పేర్కొంటూ.. హిందూ, హిందుత్వ మాత్రమే కీ ఫ్యాక్టర్ కావాలని, అభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మన యూజర్ నేమ్, పాస్ వర్డ్ హిందుత్వ అని పేర్కొన్నారు.
అన్ని పార్టీలు ఒకవైపు, బీజేపీ ఒకవైపు, చెడు ఫలితం కాదు
రాజేష్ అనే నెటిజన్ కైరానాలో బీజేపీ ఓటమి అవమానకరమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కలిసి 4,21,144 ఓట్లుసాధిస్తే ఒక్క బీజేపీ 3,89,691 ఓట్లు ఒంటరిగా సాధించిందని, కాబట్టి ఇది చెడు ఫలితం కాదని అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. మీరు బీజేపీలో సమయం వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇందులో ఏ రెండు చేసినా గెలుపు
ఆర్టికల్ 370, గోవధ నిషేధం, ప్రభుత్వ ఆధీనం నుంచి ఆలయాలను తప్పించడం, యూనిఫాం సివిల్ కోడ్, ఇన్కమ్ ట్యాక్స్ అపోలిషన్, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలోకి తేవడం.. ఇందులో ఏ రెండు చేసినా బీజేపీ తిరిగి గెలుస్తుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆశా అనే నెటిజన్ స్పందిస్తూ.. అహంకారమనే సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.