"అద్భుతం జరుగుతుందా?..12గం.లకు అలా చెబుతారని.."
మరో అద్భుతం జరిగి తమిళనాడు సీఎం జయలలిత తిరిగి ప్రజలకు ముందు రావాలని కోరుకుంటున్నట్టుగా బీజేపీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.
చెన్నై: 73రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న అమ్మ ఆరోగ్యంపై ప్రస్తుతం హైడ్రామా నడుస్తోన్న సంగతి తెలిసిందే. జయలితతకు గుండెపోటు వచ్చిందన్న వార్త తమిళనాడును తీవ్ర ఉలికిపాటుకు గురిచేయగా.. దేశం మొత్తం అమ్మ ఆరోగ్యం గురించే చర్చించుకుంటున్న పరిస్థితి.
జయలలితను అమ్మ అంటూ పిలుచుకునే ఆమె అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థనలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి ప్రజలకు ముందు రావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.
సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్యస్వామి.. జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా దృఢమైన వ్యక్తియైన జయలలిత.. అనారోగ్యం నుంచి కోలుకుంటుందన్న వార్త మధ్యాహ్నాం 12గం.లకు వెలువడాలని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆ అద్భుతం జరిగిందో లేదో మరికొద్దిసేపట్లో తెలుస్తుందని చెప్పారు. జయలలిత కోలుకోవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.