ఇంత శిక్ష అనుకోలేదు: జయపై స్వామి, రూ.1 జీతమే..
చెన్నై: జయలలితకు అంత శిక్ష పడుతుందని తాను అనుకోలేదని, ఈ తీర్పుతో ఆమె విశ్వసనీయత కోల్పోయారని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇక జయలలిత రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. జయలలితకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అలాగే వంద కోట్ల జరిమానాను కోర్టు విధించింది.
కొంపముంచిన రూపాయి జీతం
జయలలిత 1991లో మొట్టమొదటిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకుంటానన్నారు. ఆమె అధికారిక ఆదాయం ఐదేళ్లలో రూ.60 మాత్రమే ఉండాలి. కానీ ఆమె భారీగా అక్రమంగా ఆస్తులు పోగేసుకున్నట్లు సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేశారు. ఆ కేసులోనే ఇప్పుడు జయకు శిక్ష పడింది.
అచ్చిరాని సెప్టెంబర్
సెప్టెంబర్ నెలకు-అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కష్టాలకూ దగ్గరి సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె రాజకీయ జీవితాన్ని తీవ్ర ఒడిదుడుకులకు గురి చేసిన రెండు తీర్పులు ఈ నెలలోనే వచ్చాయి. ఏదైనా క్రిమినల్ కేసులో ఒక వ్యక్తి దోషిగా తేలి, రెండేళ్లకుపైగా శిక్ష పడితే వారిని సీఎంగా నియమించకూడదని, అప్పటికే అధికారంలో ఉంటే వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని 2001 సెప్టెంబర్ నెలలోనే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం టాన్సీ భూముల కేటాయింపు కేసులో ఏకగ్రీవ తీర్పు చెప్పింది.
దాంతో అప్పట్లోనూ జయలలిత వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇపుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు కూడా సెప్టెంబర్ నెలలోనే రావడం విశేషం. ఈ కేసులో కూడా బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల శిక్ష విధించడంతో ఇపుడు కూడా అన్నాడీఎంకే అధినేత్రికి మరోసారి పదవీ గండం ఏర్పడింది.