బెయిల్ వచ్చింది కానీ, గర్ల్ఫ్రెండ్స్ను కలవలేరు: శశిధరూర్పై స్వామి
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో భర్త శశిథరూర్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం, ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు.
శశి థరూర్కు వేడుక చేసుకునేంత విషయమేమీ లేదని, అయినా ఆయన తీహార్ జైల్ నుంచి బెయిల్పై విడుదల కాలేదని, కావాలంటే బెయిల్వాలాలు అయిన కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి కూర్చోవచ్చని వ్యాఖ్యానించారు.
శశిథరూర్ తరుచూ విదేశాలకు వెళ్లడంపై మాట్లాడుతూ... ఆయనకు బెయిల్ వచ్చింది కానీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని, ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న తన గర్ల్ఫ్రెండ్స్ను కలవలేరని వ్యాఖ్యానించారు.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సునంద పుష్కర్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు రోజుల క్రితమే పుష్కర్ తన భర్త థరూర్కు, పాకిస్థాన్ జర్నలిస్ట్తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
పుష్కర్ మరణించడానికి కొన్ని రోజుల ముందు థరూర్ ఆమె ఫోన్కాల్స్ను నిర్లక్ష్యం చేశాడని, ఫోన్ చేస్తే కట్ చేశారని అందువల్లే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని సునంద మృతి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని శశిథరూర్ పైన ఆరోపణలు ఉన్నాయి.