మమతకి రివర్స్! ఆ ఎంపీ ఇకవద్దు: స్వామి, నో సీక్రెట్
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీ విమాన ప్రమాదంలో మరణించారంటూ ప్రచారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు సుగతో బోస్ను పార్లమెంటు నుంచి బయటకు పంపించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం డిమాండ్ చేశారు.
సోవియట్/నెహ్రూ ప్రచారాన్ని బలపరిచారని, ఇప్పుడు అదంతా అసత్యమని తేలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అసత్యమని తేలినందున సుగతో బోస్ను పార్లమెంటు నుంచి బయటకు పంపించేందుకు ఓ తీర్మానం చేయాలన్నారు.
కాగా, మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం నాడు నేతాజీకి చెందిన కొన్ని ఫైల్స్ను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీ సుగతో బోస్ గతంలో చేసిన వ్యాఖ్యలతో సుబ్రహ్మణ్య స్వామి కౌంటర్ ఇచ్చారు.
మామూలు ఫైల్లే!
పశ్చిమ బెంగాల్ సర్కారు బహిర్గతం చేసిన నేతాజీకి సంబంధించిన ఫైళ్లలో ఆయన గురించిన రహస్యాలు ఎంతమాత్రమూ లేవని తెలుస్తోంది. వీటిని చూస్తే, ఆయన ఎలా, ఎప్పుడు మరణించారన్న విషయం లేదని సమాచారం. ఆయన మరణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది.
కాగా, ఇప్పటికే తమ వద్ద ఉన్న నేతాజీ ఫైల్స్ ను బహిర్గతం చేయలేమని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మమత సర్కారు మాత్రం బెంగాల్ అధీనంలో ఉన్న వాటిని బయట పెట్టింది.
తనకు సహాయపడాలంటూ, ఆయన రాసిన కొన్ని లేఖలు ఈ ఫైల్స్ లో ఉన్నాయని, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న చర్యలపై అప్పటి ప్రభుత్వం జరిపించిన విచారణ వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆయన తైవాన్ లో మరణించలేదని, 1964 వరకూ బతికే ఉన్నారని అమెరికా రహస్య పత్రం ఒకటి చెబుతోంది.