సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం: స్వామి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చిన తరువాత సుబ్రమణ్యస్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విజయం తనదేనని సుబ్రమణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపై తన పోరాటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తనతో ఏనాడూ చర్చించలేదని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసును తాను రాజకీయ కక్షతో వెయ్యలేదని సుబ్రమణ్యస్వామి తెలిపారు. తాను ఈ కేసు ఎప్పుడో వేశానని, అప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని కాదనే విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చెయ్యటాన్ని సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. అవినీతిపై తాను పోరాటం చేసి నేటి యువతలో చైతన్యం తీసుకురావడానికి చివరి వరకూ పోరాటం చేస్తానని సుబ్రమణ్యస్వామి తెలిపారు.