సామాన్యుడి ఇంటికి ఊహించని అతిథి.. విజయ్కాంత్ ఇంత సింపుల్గా!
మిట్ట మధ్యాహ్నాం పూట కడుపులో ఆకలి దంచేయడంతో.. మార్గమధ్యలో విశాలమైన ఓ పెంకుటిల్లు ఎదుట కారు ఆపారు.
చెన్నై: ఆలయ దర్శనం కోసమని సతీమణితో కలిసి బయలుదేరిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్.. అనుకోని అతిథిలా ఓ సామాన్యుడి ఇంట దర్శనమిచ్చారు. తొలుత ఎవరో అనామక వ్యక్తి అని కసురుకున్న సదరు ఇంటి యజమాని.. ఎదురుగా ఉన్నది విజయ్ కాంతే అని తెలుసుకున్నాక.. అతని ఆనందానికి అవదుల్లేవు.
ఇంతకీ అసలు సంగతేంటంటే.. సతీమణి ప్రేమలతతో కలిసి డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఈరోడ్ జిల్లాలోని సెన్నిమలై మీదుగా ఓ ఆలయానికి వెళ్లారు. అయితే మిట్ట మధ్యాహ్నాం పూట కడుపులో ఆకలి దంచేయడంతో.. మార్గమధ్యలో విశాలమైన ఓ పెంకుటిల్లు ఎదుట కారు ఆపారు.

ఎండవేడి ఎక్కువగా ఉండటంతో తలకు ఎర్ర తువాలును పాగాలా చుట్టుకున్నారు విజయ్ కాంత్. అనంతరం వెంట తెచ్చుకున్న భోజనాన్ని అక్కడే అరిటాకులో పెట్టుకుని ఇద్దరు ఆరగించడం మొదలుపెట్టారు. ఇంతలో పొలం నుంచి వచ్చిన సదరు ఇంటి యజమాని.. ఎవరో అనామకులు అంటూ ఛీదరించుకున్నాడు.
అయితే దగ్గరికొచ్చి చూస్తే.. ఎదుట ఉన్నది విజయ్ కాంత్ కావడంతో సదరు యజమాని చాలా సంబరపడిపోయాడు. అంతేకాదు, కొన్ని స్వీట్లను, వంటకాలను తెచ్చి దంపతులిద్దరికీ పెట్టాడట. దీంతో ఆ దంపతులిద్దరు సదరు యజమాని పెట్టిన వంటకాలను కూడా ఆరగించారట.
ఇక విజయ్ కాంత్ దంపతులు గ్రామంలోనే ఉన్నారని తెలియగానే జనమంతా అటువైపు పోటెత్తారు. దీంతో ఆ యజమానికి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి మెరుపువేగంతో వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications