జేడీఎస్ తర్వాత సీఎం సిద్ధరాయ్యను కలిసిన నటుడు సుదీప్: కర్ణాటకలో ఏం జరుగుతోంది?
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధినేత కుమారస్వామిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా, కన్నడ చలనచిత్ర కప్(కేసీసీ) క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్యను సుదీప్ కోరినట్లు తెలిసింది. అయితే, ఈ భేటీ సందర్భంగా సుదీప్.. సీఎంతో కొద్దిసేపు వివిధ అంశాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, సుదీప్ దేవేగౌడ పార్టీ చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సీఎంను కలవడం కన్నడలో సంచలనంగా మారింది. అయితే, నెల రోజుల క్రితం కూడా సుదీప్ సీఎంను కలిశారు.
ఇది ఇలావుంటే సుదీప్కు బళ్లారి లేదా చిత్రదుర్గా నియోజకవర్గ టికెట్ ఇచ్చేందుకు కూడా జేడీఎస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, సుదీప్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా సుదీప్ను ఎన్నికల బరిలోకి దించాలని యత్నిస్తున్నట్లు తెలిసింది.
కుల ప్రాతిపదికన సుదీన్ ను రంగంలోకి దించాలని అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సినీనటులకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండటం గమనార్హం. ఇప్పటి మరో ప్రముఖ నటుడు ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగోతంది.