హింసను చూస్తూ ఉండలేను: రాజ్యసభలోనే మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేది రాజీనామా, మోడీపై..
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అధికార టీఎంసీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగా, ఈయన కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభలో మాట్లాడుతూనే రాజీనామా ప్రకటించిన దినేశ్ త్రివేది
టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేది తన రాజ్యసభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించడం గమనార్హం. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది స్పష్టం చేశారు.
బెంగాల్లో హింసను చూస్తూ ఉండలేకే..
'బెంగాల్లో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. దాని గురించి ఇక్కడేం మాట్లాడట్లేదు. హింసను అరికట్టేలా నేనేమీ చేయలేకపోతున్నందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బాధగా ఉంది. నన్ను ఇక్కడికి పంపించినందుకు మా పార్టీకి నేను కృతజ్ఞతగా ఉంటాను. కానీ, అక్కడ దాడులు జరుగుతుంటే నేను మౌనంగా కూర్చోలేను. ఏం చేయలేని నువ్వు ఇక్కడ ఎందుకు? అని నా అంతరాత్మ ప్రశ్నిస్తోంది. అందుకే రాజీనామా చేస్తున్నా' అని త్రివేది పార్లమెంటులో ప్రకటించారు.
మమతా బెనర్జీ టీఎంసీకి దినేశ్ త్రివేది రాజీనామా షాక్..
అయితే, రాజీనామాకు ప్రక్రియ ఉంటుందని, దీనిపై ఛైర్మన్కు లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సూచించారు. అ తర్వాత త్రివేది తన రాజీనామా లేఖను ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు అందించారు. త్రివేది నిర్ణయంతో తృణమూల్ పార్టీ ఖంగుతింది. ఆయన పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమని టీఎంసీ ఎంపీలు వ్యాఖ్యానించారు. పార్టీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని టీఎంసీ ఎంసీ సౌగతా రాయ్ అన్నారు.
ప్రధాని మోడీపై దినేశ్ త్రివేది ప్రశంసలు.. బీజేపీలోకి వెల్కం అంటూ..
మరోవైపు, దినేశ్ త్రివేది కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయన కూడా బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దినేశ్ త్రివేది రాజీనామాపై బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ స్పందించారు. ఒక్క త్రివేదినే కాదు, నిజాయితీగా పనిచేసే వారెవరూ టీఎంసీలో ఉండలేరని అన్నారు. ఒకవేళ దినేష్ త్రివేది బీజేపీలోకి వస్తామంటే స్వాగతిస్తామని కైలాష్ తెలిపారు.