సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా విద్యాసంస్థకు తాళం, రూ. 10 కోట్లు అద్దె చెల్లించలేదంట ?
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడు వస్తారు ? అని దేశం మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు పెద్ద షాక్ ఎదురైయ్యింది.
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడు వస్తారు ? అని దేశం మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు పెద్ద షాక్ ఎదురైయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులకు చెందిన విద్యాసంస్థకు బుధవారం తాళం పడింది.
రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆశ్రమ మెట్రికులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ (ఇంటర్ వరకు) అనే విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. ఆశ్రమ విద్యాసంస్థలు మొత్తం లతా రజనీకాంత్ చూసుకుంటున్నారు. చెన్నైలోని రేస్ కోర్స్ సమీపంలోని గండీ ప్రాంతంలో ఈ విద్యాసంస్థలకు ఓ బ్రాంచ్ ఉంది.
షాక్ ఇచ్చిన యాజమాన్యం
బుధవారం ఒక్క సారిగా ఈ విద్యాసంస్థలు ఉన్న భూమి యజమానులు స్కూల్ ముందు ప్రత్యక్షం అయ్యారు. వెంటనే విద్యాసంస్థల ప్రధాన ప్రవేశ ద్వారానికి తాళం వేసి రజనీకాంత్ కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న తమిళనాడు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రూ. 10 కోట్లు అద్దె ?
గత ఐదు సంవత్సరాల నుంచి ఆశ్రమ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ప్రాంతానికి రూ. 10 కోట్లు అద్దె చెల్లించకపోవడంతోనే తాము తాళం వేశామని ఆ స్థలం యజమానులు మీడియాకు చెప్పారు. గండీ ప్రాంతంలోని విద్యాసంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న దాదాపు 300 మంది విద్యార్థులను వెంటనే చెన్నైలోని వేలచ్చేరీలోని మరో బ్రాంచ్ కు తరలించారని సమాచారం.
రెండో సారి తాళం
మొత్తం మీద సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ 5 సంవత్సరాల నుంచి విద్యాసంస్థలు నిర్వహిస్తున్న స్థలానికి అద్దె చెల్లించలేదని తెలుసుకున్న తమిళనాడు ప్రజలు షాక్ కు గురైనారు. గతంలో అద్దె చెల్లించలేదని 2011లో ఓ సారి స్కూల్ కు తాళం వేశారు.
పుకార్లు అంటున్న ఫ్యాన్స్
ఇవన్నీ పుకార్లు అని ప్రజలు ఎవ్వరూ నమ్మకూడదని సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ సోషల్ మీడియాలో మనవి చేసింది. ఈ స్థలం వ్యవహారం కోర్టులో విచారణలో ఉందని, అద్దె చెల్లించలేదనేది వాస్తవం కాదని స్కూల్ యాజమాన్యం బుధవారం సాయంత్రం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.