కోటీశ్వరుల్లో సుజన ఫస్ట్: హర్సిమ్రాత్ 3, దత్తాత్రేయ 17
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అత్యంత ధనికుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి రికార్డ్లకెక్కారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ప్రస్తుత కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మొత్తం 66 మందిలో 64 మంది ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణ పత్రాలను విశ్లేషించి ఏడీఆర్ ఈ నిర్ణయానికి వచ్చింది.
సుజనా చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో చోటు దక్కిన కోటీశ్వర ఎంపీల్లో ఈయన మొదటి వరుసలో ఉండటం గమనార్హం. ఈయన మొత్తం ఆస్తి విలువ రూ.189 కోట్లు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేత.
1961లో మంచి విద్యావంతులైన ఫ్యామిలీలో జన్మించారు సుజనా. ఇంజనీరింగ్ విద్యలో మాస్టర్ డిగ్రీని పొందారు. 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల టర్నోవర్తో ఆరువేల మందితో వ్యాపారం చేస్తున్నారు.
2011 జులై నాటికి వెల్లడైన నివేదిక మేరకు దేశంలో బాగా విస్తరిస్తున్న టాప్ 10 కంపెనీల్లో సుజనా గ్రూపు ఒకటిగా ఉంది. టీడీపీకి నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరించిన సుజనా.. 1995-2004 మధ్య కాలంలో టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మంచి సన్నిహితులు. ఈయనను నాలుగేళ్ల క్రితం రాజ్యసభకు పంపించారు.
కాగా, కుబేర మంత్రుల్లో సుజా చౌదరి తర్వాత.. అరుణ్ జైట్లీ రూ.113 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హర్సిమ్రాత్ కౌర్ బాదల్ (రూ.108 కోట్లు), జయంత్ సిన్హా (రూ.55 కోట్లు), మహేశ్ శర్మ (రూ.47 కోట్లు), మేనకా గాంధీ (రూ.37 కోట్లు), పీయూష్ గోయల్ (రూ.30 కోట్లు) ఉన్నారు.
ఆస్తులు తక్కువగా ఉన్న వారిలో సాధ్వి నిరంజన్ జ్యోతి మొదటి స్థానంలో ఉన్నారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రూ.9 కోట్లతో పదిహేడవ స్థానంలో ఉన్నారు.
ఇక మంత్రుల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా ఉంది. 64 మందిలో 20 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో నలుగురు కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 11 మంది పైన తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. మంత్రుల్లో 19 మంది పట్టభద్ర నిపుణులు ఉన్నారు. కాగా, ఇద్దరు మంత్రులు ఏ సభలోను సభ్యులు కాకపోవడంతో ారి ఆస్తులను పరిగణలోకి తీసుకోలేదు.