మీరే విచారణ చేసుకోవచ్చు: సుజన, ఎన్టీఆర్ భవన్కు..
హైదరాబాద్: తన పైన అవినీతి ఆరోపణలు చేసిన వారు విచారణ జరుపుకోవచ్చునని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి గురువారం అన్నారు. సుజన పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఆయనను డిఫాల్టర్ అన్నారు. దీని పైన సుజన స్పందించారు.
అవినీతి ఆరోపణలు చేసిన వారే తనపై విచారణ చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఆయన లైట్గా తీసుకున్నారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత సుజనా చౌదరి గురువారం తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు.
ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సుజన మాట్లాడారు. నెలలో రెండు, నాలుగు శనివారాల్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
కాగా, సుజనా చౌదరి పైన అజయ్ మాకెన్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సుజన డిఫాల్టర్ అని, ఆయనకు ఎలా పదవి ఇస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన ప్రశ్నించారు. టాప్ 20 ఎన్సీఏలో సుజన ఉన్నారన్నారని తెలుస్తోంది. దీని పైన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, టీడీపీ నేతలు కూడాస్పందించారు.
సుజన పైన ఆరోపణలను జైట్లీ ఖండించారు. సుజనా చౌదరిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. సుజనాకి చెందిన ఒక సంస్థ నష్టాల్లో పడిపోయిందని, ఆ సంస్థకు సంబంధించిన రుణాలను పునర్ వ్యవస్థీకరించటం జరిగిందని, అప్పటి నుండి ఆ సంస్థ సదరు బ్యాంకుకు వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తోందని జైట్లీ తెలిపారు. సుజన ఆంధ్రప్రదేశ్లో పేరున్న పారిశ్రామికవేత్త అన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి వైఎస్ (సుజనా) చౌదరికి మారిషస్కు చెందిన హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్తో, ఆ కంపెనీ చేసిన రుణాలతో ఎటువంటి సంబంధం లేదని, ఆ కంపెనీలో ఆయన వాటాదారుడుగా కాని డైరెక్టర్గా కాని లేరని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు పి.అఫ్సర్ హుస్సేన్ ఒక ప్రకటనలో చెప్పిన విషయం తెలిసిందే.