నన్ను చంపేస్తారేమోనన్న భయం ఉంది.. పోలీస్ రక్షణ కావాలి: సుఖేష్
తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన కేసులో తాను అరెస్టయినందునా.. చంపేస్తారేమోనన్న భయం ఉందని కోర్టుకు అతను విన్నవించుకున్నాడు.
చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఎన్నికల సంఘానికి దినకరన్ లంచం' వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తం తమిళ రాజకీయాలనే మరోసారి తలకిందులు చేసిన ఈ వ్యవహారంలో సుఖేష్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
నిండా ముప్పై ఏళ్లు కూడా లేని సుఖేష్ చంద్రశేఖర్ వందల కోట్ల నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న తీరు పోలీసులనే విస్మయ పరుస్తోంది. సుఖేష్ నేరాల చిట్టా ఒక్కొక్కటి వెలుగుచూస్తుండగా.. తనకు ప్రాణ హాని ఉందని తాజాగా అతను కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన కేసులో తాను అరెస్టయినందునా.. చంపేస్తారేమోనన్న భయం ఉందని కోర్టుకు అతను విన్నవించుకున్నాడు. తనకు పోలీస్ భద్రత కావాలని కోరాడు. ఈ మేరకు సుఖేష్ తరుపు న్యాయవాది ఢిల్లీ సీజ్ అజారే జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, సుఖేష్ అరెస్టు అనంతరం ఇక దినకరన్ ను అరెస్టు చేయడం లాంచనమే అని భావించినప్పటికీ.. సుఖేష్ ను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే ఆయన్ను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 17ఏళ్లకే నేర చరిత్రను మొదలుపెట్టిన సుఖేష్ పై ఇప్పటివరకు 19 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నమోదైన ఈ కేసులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెలికితీస్తున్నారు.