అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితం
తేజ్పూర్: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30ఎంకెఐ యుద్ధవిమానం మంగళవారం మధ్యాహ్నం అసోం రాష్ట్రంలో కూలిపోయింది. తేజ్పూర్కు 35 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
తేజ్పూర్లోని సలనిబారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానం కాసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదం మంగళవారం 12.30గంటల ప్రాంతంలో జరిగినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ప్రమాదం నుంచి పైలల్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం
లక్నో: ఢిల్లీ-భువేశ్వర్ ఎయిరిండియా విమానం ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 169 మంది ప్రయాణీకులు ఉన్నారు.