సుఖోయ్ సమస్యలు: పక్కకు తప్పించాలని యోచిస్తున్న ఐఏఎఫ్?
భారత వాయుసేనలో కీలకమైన అత్యాధునిక యుద్ధ విమానాలు ‘సుఖోయ్ - 30’ ఇంజిన్లలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఐఏఎఫ్ అమ్ముల పొదిలో 1997లో ప్రవేశపెట్టిన 240 సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఇప్పటికే ఏడింటిని
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో కీలకమైన అత్యాధునిక యుద్ధ విమానాలు 'సుఖోయ్ - 30' ఇంజిన్లలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఐఏఎఫ్ అమ్ముల పొదిలో 1997లో ప్రవేశపెట్టిన 240 సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఇప్పటికే ఏడింటిని భారత వాయుసేన కోల్పోయింది. రష్యా నుంచి 272 సుఖోయ్ విమానాలను 12 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో కొనుగోలు చేసుకునేందుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నది.
వాటిల్లో అత్యధికం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ఆధ్వర్యంలో నిర్మించారు. గత మూడేళ్లుగా సుఖోయ్ యుద్ధ విమాన ఇంజిన్లలో 69 సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఒక్క యుద్ధ విమానం ఖరీదు అక్షరాలు రూ.2000 కోట్లకు పై మాటే. తాజాగా మంగళవారం ఉదయం 10. 30 గంటలకు తేజ్ పేర్ వాయుసేన స్థావరం నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్ యుద్ధ విమానం 11.10 గంటలకు చైనా సరిహద్దుల్లో అద్రుశ్యమైంది. ఆ తర్వాత రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కానీ ఎక్కడ మిస్సయిందన్న సమచారం లేకపోవడం అన్వేషణ కష్టమని చెప్తున్నారు.
తాజా ఘటనల నేపథ్యంలో సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగించాలా? వద్దా? అని భారత వాయుసేన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన సుఖోయ్ యుద్ధ విమాన ప్రమాదాల్లో ఐఎఎఫ్ 80 మంది జవాన్లను కోల్పోయింది.
ఇంజిన్ సంబంధ సమస్యలతోపాటు ఈ విమానానికి సర్వీస్, విడి భాగాలు అందుబాటులోకి లేకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. సుఖోయ్ యుద్ద విమానాల నిర్వహణ మరొక సమస్యగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం గతంతో పోలిస్తే సుఖోయ్ యుద్ధ విమానాల పనితీరు 52 శాతం నుంచి 60 శాతానికి మెరుగు పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య సుఖోయ్ యుద్ధ విమానాల దీర్ఘకాల నిర్వహణ బాధ్యతలను ఆకంపెనీకే అప్పటించే అవకాశాలను కొట్టి పారేయడం లేదు.
ప్రస్తుత తరుణంలో సుఖోయ్ విమానాలను పక్కకు తప్పించి, ముందస్తు చర్యలు చేపట్టిన తర్వాతే వాటిని వినియోగంలోకి తెస్తారు. అంతకుముందు 2009 ఏప్రిల్ నుంచి 2011 డిసెంబర్ వరకు ముందస్తు చర్యలు తీసుకున్న తర్వాత తిరిగి సుఖోయ్ విమానాలను వినియోగంలోకి తెచ్చారు. 2016లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ సుఖోయ్ యుద్ధ విమానాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని అంగీకరించారు.