అర్ధరాత్రి అడవిలో బీభత్సం -ఐఈడీ పేల్చిన మావోయిస్టులు -కోబ్రా కమాండెంట్ మృతి -10 మందికి గాయాలు
మావోయిస్టులు, ఇతర నక్సల్ గ్రూపుల ఏరివేత ఆపరేషన్లలో దిట్టగా పేరుపొందిన 'కమాండెంట్ బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)' దళానికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అడవిలో మాటువేసిన మావోయిస్టులు.. అర్ధరాత్రి ఐఈడీలతో బీభత్సం సృష్టించారు. తద్వారా చాలా రోజుల తర్వాత ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయినట్లయింది. బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ ఆదివారం మీడియాకు చెప్పిన వివరాలివి..
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర (ఐఈడీ) పేల్చారు. ఈ దాడిలో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మరణించారు. మరో 9 మంది కమాండర్లు తీవ్రంగా గాయపడ్డారు.
సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు, ఛత్తీస్గఢ్ పోలీసులు శనివారం సాయంత్రం నుంచి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో అర్ధరాత్రి సమయంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చివేశారు.
Recommended Video
''మావోయిస్టుల దాడి గురించి తెలియగానే అదనపు బలగాలు ఘటనా స్థలానికి వెళ్లాయి. దాడిలో గాయపడిన వారందరినీ అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించాం. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆదివారం ఉదయం కోబ్రా అసిస్టెంట్ కమాండర్ నితిన్ ప్రాణాలు కోల్పోయారు. మిగితా తొమ్మిది మంది జవాన్లకు చికిత్స కొనసాగుతోంది'' అని ఐజీ సురేందర్రాజ్ తెలిపారు.