సుకుమా దాడి ఘటన: అత్యధికులు మహిళా మావోయిస్టులే, వెలుగులోకి సంచలన విషయాలు
సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టుల్లో.. 70 శాతం మంది మహిళలే ఉన్నారు. భారీ స్థాయిలో ఏకే–47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో కూడిన 300–400 మంది మావోయిస్టులు ఈ దాడి జరిపారు.
రాయ్ పూర్: సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టుల్లో.. 70 శాతం మంది మహిళలే ఉన్నట్టు తెలిసింది. భారీ స్థాయిలో ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో కూడిన 300-400 మంది మావోయిస్టులు ఈ దాడి జరిపినట్లు సమాచారం.
దక్షిణ బస్తర్ ప్రాంతంలోని చింతగూడలో ఈ భీకర దాడి జరిగింది. గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్లో 25 మంది మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయారు.
చింతగూడ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది. ఇక్కడ గతంలోనూ చాలా దాడులు జరిగాయి. భౌగోళికంగా ఆ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉంటుంది. 'ముందుగా మేం ఎంతమంది ఉన్నామో తెలుసుకోడానికి గ్రామస్తులను పంపారు. దాడి చేయడానికి వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళలే! వాళ్లంతా నల్లటి యూనిఫారాలు ధరించి ఏకే సిరీస్, అసాల్ట్ రైఫిళ్ల లాంటి అత్యాధునిక ఆయుధాలు తీసుకొచ్చారు' అని గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను ఒకరు చెప్పారు.
వ్యూహం మార్చి.. మావోయిస్టుల పనిపడతాం: రాజ్నాథ్ సింగ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి మావోయిస్టుల పని పడతాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. నిరాశ, నిస్పృహతోనే మావోయిస్టులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆయన రాయ్పూర్లో మంగళవారం నివాళి అర్పించారు. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన వర్ణించారు.
'ఇవి క్రూర హత్యలు. మన అమర జవాన్ల బలిదానం వృథా కాదు. మావోయిస్టుల దాడులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది' అని రాజ్నాథ్ అన్నారు. మావోయిస్టుల సమస్యపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల అధికారులతో మే 8న సమావేశం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా మృతులకు నివాళులు అర్పించారు. బస్తర్లోని మారుమూల గ్రామంలో సోమవారం మావోయిస్టులు దాడి చేయడంతో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.