మోడీ-షాలపై పోరు సులభం కాదు, భారత్ మారింది: జైరాం రమేష్
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పార్టీ నాయకులు కలిసి కట్టుగా పోరాడాలన్నారు.
మోడీ, అమిత్ షాల ఆలోచనలు, ఆచరణ భిన్నంగా ఉంటాయని, దృక్పథం మార్చుకోకుంటే వారిని ఎదుర్కోలేమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం కోల్పోయినప్పుడు ఇదే తరహా సంక్షోభాన్ని ఎదుర్కొందని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావించడం తప్పవుతుందన్నారు. భారత్ మారిందని, పాత చింతకాయ పచ్చడి నినాదాలు, ఎత్తుగడలు పని చేయవన్నారు.
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపడితేనే అనిశ్చితికి ముగింపు పడగలదని అభిప్రాయపడ్డారు. 1997-2004 వరకు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఎన్నికల సంక్షోభాలను ఎదుర్కొందని, అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఓటమి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొందని చెప్పారు.
కానీ ఇప్పుడు ఉనికే సంక్షోభంలో పడిందన్నారు. మోడీ - షాలపై పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోవాలన్నారు. 2019లో మోడీకి గట్టిపోటీ ఇవ్వగల నాయకుడు కాంగ్రెస్లో ఉన్నారా అని ప్రశ్నించగా.. సమష్టి కృషితో ఎదర్కోగలమన్నారు.