మాజీ సీఎం సిద్దరామయ్యతో నటి సుమలత భేటీ, లోక్ సభ టిక్కెట్, సీఎం కొడుకుకు చెక్, టైం కావాలి!
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించిన స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ నటి సుమలత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సుమలత భేటీ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్న సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు చెక్ పెట్టాలని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
రాజకీయ ప్రవేశంపై చర్చ
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయిన తరువాత సుమలత మీడియాతో మాట్లాడారు. తన భర్త అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం ఉన్నారని గుర్తు చేశారు. అందువలన తన రాజకీయ రంగప్రవేశంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించి వారి అభిప్రాయం తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో తాను భేటీ అయ్యానని సుమలత వివరించారు.
గోడ మీద దీపం పెట్టిన సిద్దూ !
మండ్య ప్రజలు, అంబరీష్ అభిమానులు తాను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని సిద్దరామయ్యకు తాను చెప్పానని సుమలత అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని, సీట్ల పంపిణి విషయంలో చర్చ జరుగుతోందని, ఇప్పుడే ఎవరికి ఏ సీటు అని చెప్పడం సాధ్యం కాదని, సాటి పార్టీ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య హామీ ఇచ్చారని సుమలత వివరించారు.
ప్రజల నిర్ణయం
మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు కేటాయిస్తే ఏమి చేస్తారు ? అంటూ మీడియా ప్రశ్నించగా ఇప్పుడే ఆ విషయంపై మాట్లాడటం సరికాదని సుమలత అన్నారు. అయితే మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు కేటాయిస్తే తనను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్న ప్రజలు, అంబరీష్ అభిమానులతో చర్చించి తరువాత నిర్ణయం తీసుకుంటానని సుమలత స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకుల ఆశలు
మండ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆశపడుతున్నారని సుమలత గుర్తు చేశారు. గతంలో అంబరీష్ కు పట్టం కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నేడు తాను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని సుమలత అన్నారు. మండ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తారని తనకు నమ్మకం ఉందని సుమలత ఆశాభావం వ్యక్తం చేశారు.
వీర జవానుకు భూమి
గురువారం మండ్య వెలుతున్నానని చెప్పిన సుమలత ఇటీవల జమ్మూ కాశ్మీరు లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన గురు ఇంటికి భేటీ అవుతానని అన్నారు. ఇది రాజకీయం కాదని, గురు కుటుంబ సభ్యులకు అర్ద ఎకరా భూమి ఇస్తానని తాను మాట ఇచ్చానని, గురువారం అర్ద ఎకరా భూమిని వీర జవాను గురు కుటుంబ సభ్యులకు తాను అప్పగిస్తానని సుమలత అన్నారు. గురు కుటుంబ సభ్యులతో భేటీ అయిన సమయంలో తాను ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని, ఇది సరైన సమయంకాదని సుమలత చెప్పారు.
సీఎం కొడుకు పోటీ ?
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, బహుబాష నటుడు నిఖిల్ కుమారస్వామి జేడీఎస్ టిక్కెట్ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. మండ్య జిల్లాలో జేడీఎస్ కు మంచి పట్టుఉంది. జేడీఎస్ నాయకులు మండ్య నియోజక వర్గం తమకు కేటాయించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అయితే అంబరీష్ అభిమానులు, మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు సుమలతను రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చెయ్యడం, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సుమలత భేటీ కావడంతో ఇప్పుడు ఆ నియోజక వర్గం ఎవరికి కేటాయిస్తారు అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.