బీజేపికి ఝలక్ ఇచ్చిన సుమలత..! లోక్ సభలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తానని తేల్చేసిన ఎంపీ..!!
బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక మండ్య నుంచి ఎంపికైన ఎంపీ, సినీ నటి సుమలత బీజేపీలో చేరబోతున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్లో తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో జేడీఎ తో చేతులు కలుపకుండా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగివుంటే మరిన్ని లోక్సభ స్థానాల్లో విజయం లభించివుండేదన్నారు. జేడీఎస్తో పొత్తు అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసివుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.
మలుపులు తిరుగుతున్న సుమలత ఎపిసోడ్..! సినిమా థ్రిల్లర్ గా మారిన క్లైమాక్స్..!!
దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని నియోజకవర్గాల మీద విపరీతమైన ఆసక్తి వ్యక్తమైంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటిగా కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంగా చెప్పాలి. తన భర్త అంబరీశ్ మరణం నేపథ్యంలో ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నికల బరిలో దిగిన సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడితో పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఆమె విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఎవ్వరితో కలవను..! నన్నొదిలెయ్యండంటున్న సుమలత..!!
ఆమె గెలుపులో బీజేపీ కీలక భూమిక పోషించినట్లుగా చెప్పాలి. మండ్యలో బీజేపీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించకుండా కమలనాథులు.. ఆమెకు మద్దతు ఇచ్చారు. అలా ఎన్నికల్లో గెలిచిన ఆమె బీజేపీలో చేరనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సుమలత మీడియాతో మాట్లాడుతూ తన మీద సాగుతన్న ఊహాగానాలకు చెక్ చెప్పేశారు.
సుమలత నిర్ణయం పట్ల బీజేపి షాక్..! వేచి చూద్దామంటున్న మోదీ-షా..!!
తాను బీజేపీలో చేరబోవటం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని చెప్పిన ఆమె.. బీజేపీలో చేరే ఆలోచన లేదని చెప్పారు. సుమలత తాజా వ్యాఖ్యలు మోడీషాలకు షాకివ్వటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్నికల వేళలో అన్ కండిషనల్ గా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆమె పార్టీలో చేరుతుందని భావించినా.. అందుకు భిన్నమైన నిర్ణయాన్ని ఆమె వెల్లడించారు.
బీజేపి ప్రజాబలంతో గెలవలేదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కథానాయిక..!!
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ ఓటమిపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ పొత్తు కారణంగా కాంగ్రెస్ విజయవకాశాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే 10 లోక్ సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ఉండేవారన్నారు. తాను ఇదే విషయాన్ని కాంగ్రెస్ కు తెలియజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకరాష్ట్రంలో బీజేపీ విజయం ప్రజాబలంతో గెలవలేదని తాను భావింటం లేదని ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి ఎన్నికల్లో చేసిన సాయాన్ని వదిలేసి.. పార్టీకి దూరంగా ఉండాలని సుమలత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.