వేసవి సెలవులే ముంచాయి..: ఉపఎన్నికల్లో ఓటమిపై బీజేపీ నేత
లక్నో: ఇటీవల 4లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం రెండంటే రెండు స్థానాలను మాత్రమే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో కైరానా సిట్టింగ్ స్థానంతో పాటు నుర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయింది.
Recommended Video
ఈ నేపథ్యంలో ఓటమికి కారణాలు వెతికే పనిలో పడ్డ ఆ పార్టీ.. ఓ విచిత్రమైన వాదనను ముందుంచింది. వేసవి సెలవులే తమ కొంపముంచాయని ఆ పార్టీ చెబుతోంది. పాడి పరిశ్రమల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. 'పార్టీ మద్ధతుదారులు, కార్యకర్తలు, ఓటర్లు అంతా వేసవి సెలవుల కారణంగా కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టకూడదని అధిష్ఠానం భావించింది. ఒకవేళ వారంతా అందుబాటులో ఉండి ఉంటే కైరానా, నూర్పూర్లో బీజేపీ అవలీలగా గెలిచి ఉండేది' అని వ్యాఖ్యానించారు.
అయినా ఉపఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఇదే కోణంలో చూడవద్దని ఆయన కోరుతున్నారు. ఉపఎన్నికల్లో ఓడిపోయినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ ఓటమిపై ఆ పార్టీ హార్దోయి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
పార్టీలో అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిపాలైందని ఆయన పేర్కొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై కూడా ఆయన పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.