సునంద డెత్ మిస్టరీ : శశిథరూర్ తో ఎలాంటి సంబంధంలేదన్న పాక్ జర్నలిస్ట్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానస్పద మృతికి సంబంధించి.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ జర్నలిస్టు మెహర్ థరర్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కాగా, గత ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు మెహర్ థరర్ ను విచారించగా తాజాగా ఆ విచారణకు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి.
న్యూఢిల్లీలోని ఓ హోటల్ లో ప్రత్యేక విచారణ విభాగం (ఎస్.టీ.ఐ ) ఆధ్వర్యంలో.. మహిళా పోలీస్ సమక్షాన మెహర్ థరర్ ను ప్రశ్నించినట్టుగా సమాచారం. కాగా, థరర్ పాకిస్తాని కావడం, విచారణకు సహకరిస్తానని ఓ పోలీసు ఉన్నతాధికారికి సమాచారం అందించడంతో ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు పోలీసులు.
ఇదిలా ఉంటే, దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద అనుమానస్పద మృతి కంటే ఒకరోజు ముందు.. సునంద పుష్కర్ కు మెహర్ థరర్ కు మధ్యన ట్విట్టర్ లో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శశిథరూర్ తో సంబంధముందంటూ సునంద, మెహర్ పై ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ చోటు చేసుకుంది.
ఇదే విషయమై తాజా విచారణలో మెహర్ థరర్ ను విచారించిన పోలీసులు.. ఎంపీ శశిథరూర్ తో ఆమెకున్న సంబంధంపై పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు.. సునందతో గానీ శశి థరూర్ తో గానీ తనకు ఎలాంటి సాన్నిహిత్యం లేదని మెహర్ థరర్ విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ విచారణలో.. కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణ విభాగం రూపొందించిన కొన్ని ప్రశ్నలకు మెహర్ థరర్ తో లిఖితపూర్వక సమాధానం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే సునంద డెత్ మిస్టరీకి సంబంధించి జర్నలిస్ట్ నలిని సింగ్ చేసిన పలు వ్యాఖ్యలను కూడా థరర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సునంద మరణానికి కొన్ని గంటల ముందు ఆమె చివరిసారిగా మెహర్ థరర్ తో మాట్లాడినట్టుగా నలిని సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం.
నలిని సింగ్ చెబుతున్న వివరాల ప్రకారం.. శశి థరూర్ తన బ్లాక్ బెర్రీ మొబైల్ నుండి థరర్ మెసేజ్ లను డిలీట్ చేశాడని, అనంతరం అవే మెసేజ్ లను మళ్లీ పంపించాల్సిందిగా థరర్ ను కోరాడని చెబుతోంది. అంతేకాదు, సునంద అనుమానం ప్రకారం శశి థరూర్, థరర్ దుబాయ్ లో కలుసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది నలిని సింగ్.
2015 జనవరిలో ఢిల్లీ పోలీసులు అనుమాదస్పద మృతిగా నమోదు చేసిన ఈ కేసుకు సంబంధించి.. విషప్రయోగం కారణంగానే ఆమె మరణించినట్టు ప్రాథమికంగా ఎయిమ్స్ వైద్యులు నిర్దారించారు. అనంతరం కేసులో మరింత పురోగతి కోసం యూఎస్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కు సునంద అవయవాలను పంపించారు. ఆ తర్వాత 2015 నవంబర్ లో ఢిల్లీ పోలీసులకు నివేదిక అందించిన ఫోరెన్సిక్ ల్యాబ్, నివేదికను ఎయిమ్స్ వైద్యులు పరిశీలించాల్సిందిగా కోరింది.