సునంద కేసులో అవే కీలకం: శశిథరూర్-తల్లి మధ్య రిలేషన్ చెప్పిన శివ
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) గురువారం ప్రశ్నించనుంది. ఈ విషయాన్ని పోలీసులు బుధవారం నాడు వెల్లడించారు. సునంద కేసులో ఆమె తనయుడు శివమీనన్ను పోలీసులు ఇటీవల ప్రశ్నించారు. ఇప్పుడు థరూర్ను మరోసారి ప్రశ్నించనున్నారు.
ఇదిలా ఉండగా, సునంద మృతి కేసులో పోలీసులు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఫుటేజ్, కాల్ రికార్డ్స్, పలువురిని విచారించిన నేపథ్యంలో.. వాటి ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. సునంద మృతికి ముందు పలువురు హోటల్కు వెళ్లారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాని పైన పోలీసులు దృష్టి సారించారు.
సునంద మృతి కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నట్లు సిట్ అధికారి ఒకరు చెప్పారు. సునంద మృతికి ముందు, తర్వాత శశిథరూర్ ఎక్కడున్నారు, ఏం చేశారనే విషయంపై సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.
తాము గురువారం నాడు మరోసారి ప్రశ్నిస్తామని చెప్పారు. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆయనను విచారణకు హాజరు కమ్మని చెప్పామని తెలిపారు. అతనిని ఐపీఎల్ కోణంలోను ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
జర్నలిస్టులను, సునంద తనయుడు శివమీనన్లను ప్రశ్నించిన తర్వాత సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించారు. శివమీనన్ తన విచారణలో.. తన తల్లి సునంద, శశిథరూర్ల మధ్య ఉన్న సంబంధం గురించి తెలిపారు.
ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు కీలకమని చెబుతున్నారు. సీసీ ఫుటేజీలు, శ్యాంపిల్స్ టెస్టు కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు. అవి వచ్చాక కేసు మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు. తాము ఈ కేసుకు సంబంధించి ఎవరిని ఉపేక్షించమని చెప్పారు. ముగ్గురు, నలుగురిని నిందితులుగా అనుమానిస్తున్నారు. అయితే అసలు నిందితుడు ఎవరో తెలియాల్సి ఉందని సమాచారం.