సునంద కేసులో ట్విస్ట్, అర్జంట్అని డాక్టర్కి ఫోన్: 'కేటీ.. కేథీ.. కేథరీన్'
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పుష్కర్ను చంపిందెవరో శశి థరూర్కు తెలుసునని, థరూర్ ఆ విషయంలో నోరు విప్పాలని చెప్పిన స్వామి మరో వ్యాఖ్య చేశారు.
శశిథరూర్, సునందల మధ్య గొడవ సమయంలో కేటీ అనే పేరు వచ్చిందని డొమెస్టిక్ హెల్ప్ నారాయణ చెప్పారని, అయితే, ఆ పేరు కేటీ కాదని, కేథీ అని, కేథీ అంటే కేథరీన్కు షార్ట్ పేరు కావొచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా, పుష్కర్ను చంపిందెవరో శశి థరూర్కు తెలుసునని స్వామి అన్న విషయం తెలిసిందే. థరూర్ ఆ విషయంలో నోరు విప్పాలని ఆయన అన్నారు. సునంద పుష్కర్ను శశి థరూర్ చంపారని తాను ఏ రోజు కూడా అనలేదని ఆయన స్పష్టం చేశారు.
ఐపియల్ సహా పలు విషయాలను శశి థరూర్ మరుగుపరుస్తున్నారని ఆయన విమర్శించారు. థరూర్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. అయితే, సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను శశి థరూర్ ఖండించారు. సునంద పుష్కర్ను చంపిందెవరో తెలిస్తే సుబ్రహ్మణ్య స్వామి బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
"అతనెవరు? ఆయనకు హంతకుడు తెలిస్తే పోలీసులకు చెప్పమనండి" అని శశి థరూర్ అన్నారు. సునంద పుష్కర్ను చంపిందెవరో సుబ్రహ్మణ్య స్వామి తెలుసునంటున్నారని, తెలిస్తే చెప్పాలని ఆయన అన్నారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిస్పందిస్తూ - తనకు హంతకుడు తెలుసునని తాను అనలేదని, హంతకుడెవరో శశి థరూర్కు తెలుసునని తాను అంటున్నానని అన్నారు.
వైద్యుడికి ఫోన్
సునంద.. చావుబతుకుల్లో ఉంది... అర్జంట్గా రండి అంటూ ఓ వైద్యుడికి వచ్చిన ఫోన్ కాల్స్ ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందానికి కొత్త ఆధారాన్ని అందించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రజత్మోహన్ మంగళవారం సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
సునందా పుష్కర్ చనిపోయిన రోజు అర్జంట్గా రావాలంటూ తనకు 4 సార్లు ఫోన్కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఈ ఫోన్ కాల్స్ థరూర్, పుష్కర్ల కుటుంబ మిత్రుడు సంజయ్ నుంచి వచ్చినట్లు చెప్పారు. సునంద చావుబతుకుల్లో ఉందని, మీ కోసం కారు పంపిస్తున్నానని, అర్జంట్గా లీలా ప్యాలెస్ హోటల్కు రావాలని ఫోన్లో కోరారని చెప్పారు. థరూర్ ఆసుపత్రికి తీసుకు వెళ్లలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.