సునంద పుష్కర్ మృతి: ఇవేం కథలని మీడియాపై శశిథరూర్ ఆగ్రహం
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సోమవారం నాడు మీడియా పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు విషయమై ఆయన మీడియాపై మండిపడ్డారు. తన పైన మీడియా కుట్రతో అబద్దపు స్టోరీలు అల్లుతోందన్నారు.
సునంద పుష్కర్ మృతి కేసులో తన పైన మీడియా కథలు అల్లుతోందన్నారు. తన పైన ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, ముఖ్యంగా కేరళలోని చానల్స్లో అని చెప్పారు. కథలను కుట్రతో అల్లుతున్నారన్నారు. వారు అల్లే కథలను ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులకు ఆపాదిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ట్వీట్లు చేశారు.
మన దేశానికి బెట్టర్ అండ్ హానెస్ట్ జర్నలిజం కావాలన్నారు. వారి వారి టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు కథలు అల్లుతున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను, విలువలను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు.