బుష్, మన్మోహన్ వాడుకున్నారు!: సునంద పుష్కర్ వింత ప్రవర్తన?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ తన మృతికి కొద్ది రోజుల ముందు నుండి విచిత్రంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని శశి, పుష్కర్ల సన్నిహితుడు తేజ్ సరాఫ్ వెల్లడించారు. డిసెంబర్ 2013లో గోవాలోని తన భవంతిలో ఆ దపంతులకు అతను కొంతకాలం ఆతిథ్యం ఇచ్చారు.
ఆ సమయంలో ఆమె ఎంతో అశాంతితో ఉండేదని, మాత్రలు చాలా మింగేదని, వింతగా మాట్లాడేదని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, ప్రధాని మన్మోహన్ సింగ్లు వారి అవసరాలకు తనను వాడుకున్నారని, వారు తనతో తరుచూ మాట్లాడేవారని తెలిపిందని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ్ సరాఫ్ తెలిపారు.
ఇతరులను పరీక్షించేవారు తన సహకారం కోరేవారని ఆమె చెప్పినట్టు తెలిపారు. వారు గోవాలో ఉన్నప్పుడు రెండుసార్లు గొడవ పడ్డారని, ఆమె సరిగ్గా తిండి తినలేదని, నిద్రపోదని, ఆమె పరిస్థితి తనకు అర్థం కాలేదని చెప్పారు. మాత్రల గురించి ప్రశ్నిస్తే.. సంవత్సరాల తరబడి నిద్ర పోలేకపోతున్నానని, అందుకే ఆల్ ఫ్రాక్స్తో పాటు పెయిన్ కిల్లర్లను వాడుతున్నానని చెప్పినట్లు తేజ్ వివరించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్కు సునంద వస్తువులు
సునంద పుష్కర్ వాడిన ల్యాప్టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని గుజరాత్లోని గాంధీనగర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్కు పంపించారు. ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలోని డాటా కేసు విచారణకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.