‘మహిళలు తక్కువే’: టెక్కీ ఉద్యోగం పీకేసిన గూగుల్, పిచాయ్ ఆగ్రహం
మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ లింగవివక్షకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జేమ్స్ డామోర్ను ఉద్యోగం నుంచి తొలగించింది గూగుల్. జేమ్స్ రాసిన ఇంటర్నల్ మెమోలో..
న్యూయార్క్: మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ లింగవివక్షకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జేమ్స్ డామోర్ను ఉద్యోగం నుంచి తొలగించింది గూగుల్. జేమ్స్ రాసిన ఇంటర్నల్ మెమోలో.. టెక్నాలజీ ఉద్యోగాలకు మహిళల కంటే పురుషులే ఎక్కువగా, సరిగ్గా సరిపోతారని జేమ్స్ పేర్కొన్నారు. ఈ మెమో కంపెనీలో తీవ్ర చర్చకు దారితీసింది.
అంతేగాక, దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జేమ్స్.. కంపెనీ పాలసీని ఉల్లంఘించారని, అందుకే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తమ ఉద్యోగులకు రాసిన లేఖలో పిచాయ్ తెలిపారు. కాగా, తనని కంపెనీ నుంచి తొలగించడంపై జేమ్స్ కూడా గూగుల్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు.
జేమ్స్ గత వారం ఈ ఇంటర్నల్ మెమోను ప్రచురించాడు. కంపెనీలో వైవిధ్యపూరితమైన వాతావరణాన్ని పెంచేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందంటూ జేమ్స్ విమర్శించాడు. ఇంజినీరింగ్ ఉద్యాగాల్లో మహిళల కంటే పురుషులే బాగా రాణిస్తారని పేర్కొన్నాడు. దీంతో ఎగ్జిక్యూటివ్ల మధ్య అంతర్గతంగా పక్షపాత దోరణి నెలకొంది. కొంతమంది ఉద్యోగులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. కంపెనీలో అంతర్గతంగా ప్రచురితమైన ఈ మెమో బయటికి పొక్కడంతో.. మరింత చర్చకు దారితీసింది.
ప్రపంచ ఐటీ దిగ్గజాలలో ఒకటైన గూగుల్పై విమర్శలకు అవకాశమిచ్చే పరిణామంగా మారింది. దీంతో తమ పని స్థలంలో హానికరమైన లింగవివక్షతకు పాల్పడటం, తమ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమేనని సుందర్ పిచాయ్ తెలిపారు. వేధింపులకు, వివక్షతకు తావులేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి నడుచుకోవాలని కోరారు.