సుందర్ పిచాయ్ ఓటేశారా?
సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. సినిమా స్టార్లు, రాజకీయనాయకులు ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిలో విపరీతంగా షేర్ అవుతున్న కొన్ని ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓటు వేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటోలు రియల్వేనా? సుందర్ పిచాయ్ నిజంగా ఇండియా వచ్చి ఓటేశారా?
యోగిపై ఎందుకంత ప్రేమ?..ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన మాయ
వైరల్గా మారిన పిచాయ్ ఫోటో
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళనాడులో ఓటు వేశారంటూ కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు వాట్సప్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటింగ్ను ప్రోత్సహించేందుకు ఈ ఫొటోలను ఫార్వడ్ చేయడం వెనుక ఉద్దేశం మంచిదే అయినా... ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదన్నది అక్షర సత్యం.
యూఎస్ సిటిజన్ సుందర్ పిచాయ్
సోషల్ మీడియాలో చెప్పినట్లు సుందర్ పిచాయ్ ఓటు వేసేందుకు తమిళనాడుకు రాలేదు. ఆసలు ఆయనకు ఇండియాలో ఓటు హక్కే లేదు. వాస్తవానికి గూగుల్ సీఈఓ పిచాయ్ అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఈ లెక్కన ఆయన ప్రస్తుతం అమెరికన్ పౌరుడు కావడంతో పిచాయ్ భారత్లో ఓటు హక్కు కలిగి ఉండే అవకాశమే లేదు.
రెండేళ్ల క్రితం ఫోటో
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు రెండేళ్ల క్రితం నాటివి. 2017 జనవరిలో సుందర్ పిచాయ్ తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్పూర్ సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లు, స్టూడెంట్స్తో కలిసి ఫోటోలు దిగారు. తాను చదుకునే సమయంలో లెక్చర్లు జరిగిన క్లాస్ రూం నుంచి బయటకు వస్తూ మరికొన్ని ఫోటోలు దిగారు. వాటిని పిచాయ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలే ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
మధురైలో పుట్టిన పిచాయ్
తమిళనాడులోని మధురై సుందర్ పిచాయ్ జన్మస్థలం. చెన్నైలో స్కూలింగ్ పూర్తి చేసిన ఆయన ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందాడు. అనంతరం అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎంబీయే డిగ్రీ పొందారు.