ఈ రోజే పెట్రోల్ కొట్టించుకోండి.. రేపట్నుంచి కొత్త నిబంధనలు!
మీ వాహనంలో ఇంధనం ఉందా? లేదంటే తక్షణమే పెట్రోల్ బంక్ కు పరిగెత్తి పెట్రోలో, డీజిలో కొట్టించుకోండి. ఎందుకంటే, రేపట్నుంచి పెట్రోల్ బంకులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి.
న్యూఢిల్లీ: మీ వాహనంలో ఇంధనం ఉందా? లేదంటే తక్షణమే పెట్రోల్ బంక్ కు పరిగెత్తి పెట్రోలో, డీజిలో కొట్టించుకోండి. ఎందుకంటే, రేపట్నుంచి పెట్రోల్ బంకులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి.
ఇక నుంచి ఆదివారం నాడు పెట్రోల్ బంకులు పని చేయవు. ఈ నిబంధన రేపట్నుంచే అమలుకానుంది. అంతేకాదు, మే 15వ తేదీ (ఎల్లుండి) నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ బంకులు పని చేస్తాయి.
ఈ కొత్త నిబంధనల గురించి పలు పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే నోటీసులను కూడా అంటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ కొత్త నిబంధనలు రేపటి నుంచే అమలులోకి వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఉన్న పద్ధతి వేరు. అర్థరాత్రైనా అపరాత్రైనా సరే కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ లభించేది. బంక్ వద్దకెళ్లి హారన్ వేయడం ఆలస్యం నిద్రలో ఉన్నా లేచి వచ్చి ఇంధనం నింపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిబంధనలు తెలుసుకుని మసలుకోవాల్సిందే.. ముందు జాగ్రత్త వహించాల్సిందే!
వాహనదారులకు శుభవార్త.. నిరసన వాయిదా
వాహనాదారులకు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ శుభవార్త అందించింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలతో పెట్రోల్ బంక్ల యజమానులు తమ నిరసన వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ఆదివారం కూడా యథావిధిగా పెట్రోల్ బంక్లు పనిచేస్తాయని వారు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం యథావిధిగా పనిచేస్తాయని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేత నారాయణ ప్రసాద్ వెల్లడించారు. కమిషనర్ ఇచ్చిన స్టేటస్ కోపై న్యాయసలహా కోరతామని, సమస్యలు పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
గత డిసెంబర్ 31 నాటికి 11 డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదని నారాయణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 17న మరోసారి చర్చలకు పిలిచారని, చర్చలు విఫలమైతే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.