త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక: సీపీఎంను అక్కడా దెబ్బకొట్టి.. ఎవరీ సునీల్ దియోదర్?
Recommended Video
న్యూఢిల్లీ/అగర్తాలా: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని తన వశం చేసుకుంటోంది. ఉత్తరాదిన ఎంతో ప్రభావం చూపగలిగే కమలం పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు తక్కువ. నిన్నటి దాకా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గురించి మాట్లాడుకోవడమే వృథా అనిపించిందే.
ఎర్రకోటలో కమలదళం: త్రిపురలో బీజేపీ విజయదుందుభి
కానీ నాలుగేళ్లలో అంతా రివర్స్ అయింది. ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తాజాగా, వచ్చిన ఫలితాలతో త్రిపుర, నాగాలాండ్లలోను విజయదుందుభి మోగించింది. దీంతో నిన్నటి వరకు ఈశాన్యంలో కనిపించని కమలం.. ఒక్కసారిగా ఐదు రాష్ట్రాలను పరిపాలిస్తోంది.
బెంగాల్ తర్వాత సీపీఎం రికార్డ్, బీజేపీ చేతిలో మట్టికరిచింది
త్రిపురలో గత ఇరవై అయిదేళ్లుగా సీపీఎం అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్ తర్వాత సీపీఎంకు త్రిపురదే రికార్డ్. ఆ రికార్డ్ బీజేపీ చేతిలో మట్టికరిచింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. కానీ తాజా ఎన్నికల్లో 25 ఏళ్ల లెఫ్ట్ ప్రస్తానానికి బీజేపీ బ్రేకులు వేసింది. త్రిపురలో బీజేపీ అద్భుత విజయం సాధించింది.
గత ఎన్నికల్లో బీజేపీకి సున్నా, ఇప్పుడు దూకుడు
60 అసెంబ్లీ స్థానాలకు గాను 2013లో బీజేపీకి ఉన్న ప్రాతినిథ్యం సున్నా. అదే సీపీఎం 49 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు రివర్స్ అయింది. బీజేపీ ఏకంగా సున్నా నుంచి నలభై స్థానాలకు ఎగబాకింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న, గత ఎన్నికల్లో 49 స్థానాలు గెలిచిన సీపీఎం 18 స్థానాలకు పడిపోయింది.
త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక, ఎవరీ సునీల్?
త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక సునీల్ దియోదర్ ఉన్నారు. ఇతను 2014లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీకి మేనేజర్గా పని చేశారు. గత మూడేళ్లుగా త్రిపురలో మకాం వేసి, బీజేపీ గెలుపు కోసం పని చేశారు. దాని ఫలితం ఇప్పుడు కమలం పార్టీకి కనిపించింది.
దియోదర్ ఆరెస్సెస్ ప్రచారక్గా పనిచేశారు
2013లో బీజేపీ 1.4 శాతం ఓట్లు సాధించింది. సీపీఎం 48.11 శాతం ఓట్లు సాధించింది. కానీ తాజా ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక సునీల్ దియోదర్ పాత్ర ఎంతో ఉంది. ఆయన గతంలో ఆరెస్సెస్ ప్రచారక్గా పని చేశారు. మేఘాలయలో ఉంటారు.
గుజరాత్లో అక్కడ గెలిపించారు
గుజరాత్లో కూడా సునీల్ దియోదర్ పని చేశారు. అక్కడ అతని పని తీరు మెచ్చిన నరేంద్ర మోడీ 2014లో వారణాసిలో ఇంచార్జిగా నియమించారు. 2013లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దహోద్ జిల్లాలో కాంగ్రెస్కు ఐదు ఎమ్మెల్యే స్థానాలు, బీజేపీకి ఒకటి ఉంది. మోడీ.. దియోదర్ను అక్కడకు పంపించారు. ఐదు కాంగ్రెస్, ఒకటి బీజేపీకి ఉన్న దహోద్లో నాటి ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు రావడంలో దియోదర్ పాత్ర ఎంతో ఉంది.
ఢిల్లీలోను గెలిపించారు
2013లో దక్షిణ డిల్లీకి ఇంచార్జ్గా ఉన్న దియోదర్ పది సీట్లకు గాను ఏడు సీట్లు బీజేపీ గెలవడానికి కృషి చేశారు. మహారాష్ట్రలోను సీపీఎం స్థానంలో బీజేపీని గెలిపించారు. 2014లో మహారాష్ట్ర ఎన్నికల కోసం బీజేపీ ఆయనను రంగంలోకి దింపింది. ఆయనకు 32 నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు. శివసేన దానిని వ్యతిరేకించింది. దీంతో సునీల్ దియోదర్ను పాల్ఘర్కు పంపించారు. అక్కడ సీపీఎం హవా. నాటి మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్ఘర్ స్థానంలో సీపీఎంను ధీటుగా ఎదుర్కొని బీజేపీ అభ్యర్థి గెలిచేలా వ్యూహాలు రచించారు.
దియోదర్కు రక్షణ కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
గత మూడేళ్లుగా దియోదర్ బీజేపీ గెలుపుకు త్రిపురలో బాటలు వేశారు. లెఫ్ట్ ప్రభుత్వంలో ఆయన ప్రాణాలకు ముప్పు కూడా ఉన్నాయనే సందర్భాలు ఉన్నాయి. 2017లో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దియోదర్కు భద్రత కల్పించాలని కోరడమే అందుకు నిదర్శనం. కొందరు స్మగ్లర్లు, సంఘ వ్యతిరేకులు దియోదర్ను హత్య చేసేందుకు ప్లాన్లు వేస్తున్నారని తెలిసిందని, అందుకే ఆయన భద్రత కోసం లేఖ రాసినట్లు నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు.