అయోధ్య: ఆ స్థలానికి ఓకే, అక్కడే మసీదు నిర్మాణం, ఆస్పత్రి, లైబ్రరీ కూడా..: సున్నీ వక్ఫ్ బోర్డ్
లక్నో: అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో ఆదేశాల నేపథ్యంలో సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతోపాటు ఓ ఆస్పత్రిని కూడా నిర్మించాలని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సోమవారం నిర్ణయించింది. అంతేగాక, ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, లైబ్రరీని కూడా నిర్మించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనున్న ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకునేందుకు బోర్డు అంగీకరించిందని వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జుఫర్ ఫరూకీ తెలిపారు. మసీదు నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మసీదుతోపాటు ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ప్రజా గ్రంథాలయం, చారిటబుల్ ఆస్పత్రి, ఇతర ప్రజోపయోగ సౌకర్యాలు ఆ స్థలంలో కల్పించాలని నిర్ణయించినట్లు జుఫర్ ఫరూకీ వెల్లడించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మసీదును ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనేది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.
అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికే కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐదు ఎకరాల స్థలాన్ని అప్పగించేందుకు యూపీ సర్కారు అంగీకరించింది.
ఇది ఇలా ఉండగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే ఓ ట్రస్ట్ ఏర్పాటైంది. మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.