వివాదాస్పదమైన సన్నీ నిర్ణయం.. ప్రతినిధి నియామకంపై పలువురిఅభ్యంతరం..
గురుదాస్పూర్ : బాలీవుడ్ నటుడు, గురుదాస్పూర్ ఎంపీ సన్నీ డియోల్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. తన నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తన తరఫున హాజరయ్యేందుకు ప్రతినిధిని నియమించారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఎంపీగా ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన సన్నీ డియోల్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నిస్తున్నాయి.
గురుదాస్పూర్ ఎంపీ అయిన సన్నీ డియోల్ తాను రాసిన లేఖలో మొహాలీ జిల్లా పల్హేరీకి చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని తన ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తన నియోజకవర్గంలో జరిగే అన్ని సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలకు తన తరఫున ఆయన హాజరవుతారని స్పష్టం చేశారు.

సన్నీ డియోల్ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తనని గెలిపించిన ప్రజల్ని ఆయన వంచిస్తున్నారని విమర్శించాయి. ఒటర్లు ఎన్నుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన ప్రతినిధిగా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నిలదీసింది. ప్రజలు సన్నీ డియోల్ను తమ ఎంపీగా ఎన్నుకున్నారే తప్ప ఆయన ప్రతినిధిని కాదన్న విషయం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేత సుఖ్జిందర్ సింగ్ రణ్దావా విమర్శించారు.
ప్రతిపక్షాల విమర్శలపై సన్నీ డియోల్ ప్రతినిధి గురుప్రీత్ సింగ్ స్పందించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సన్నీ తనను నియమించారని, ప్రతి నెల ఆయన స్వయంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. 24 గంటలు ప్రజాసేవలో ఉండాలన్న ఉద్దేశంతోనే సన్నీ డియోల్ తనను ప్రతినిధిగా నియమించారని సమర్థించుకున్నారు. ముంబైలో నివాసం ఉండే సన్నీ డియోల్ తాజా లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications