బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల్లో సన్నీలియోన్
సన్నీలియోన్ తో పాటు భారత్ కు చెందిన మరో నలుగురు మహిళలకు కూడా బీబీసీ అత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చోటు దక్కడం విశేషం.
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావ శీలురైన 100మంది మహిళల జాబితాలో బోల్డ్ స్టార్ సన్నీలియోన్ చోటు దక్కించుకుంది. సన్నీలియోన్ తో పాటు భారత్ కు చెందిన మరో నలుగురు మహిళలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాలు.. అందులో అత్యంత ప్రముఖులను పరిగణలోకి తీసుకుని ఈ జాబితా తయారుచేసింది బీబీసీ. ఇంజనీర్లు, క్రీడారంగం, బిజినెస్, ఫ్యాషన్, సినిమా రంగంలో లబ్ద ప్రతిష్టులైన అనేకమంది వ్యక్తుల జాబితాను పరిగణలోకి తీసుకుని.. అందులోంచి 100 మంది మహిళలతో తుది జాబితా తయారుచేసింది.
సన్నీలియోన్తో పాటు గౌరీ చిందార్కర్(మహారాష్ట్ర), మల్లికా శ్రీనివాసన్(చెన్నై),నేహా సింగ్(ముంబై) మరియు సాలుమారద తిమ్మక్క (కర్ణాటక) భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఉన్నారు. కాగా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ (టీఏఎఫ్ఈ) సీఈవోగా వ్యవహరిస్తున్న 'ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ది చెందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్రాక్టర్స్ తయారీ సంస్థగా టీఏఎఫ్ఈ కొనసాగుతుండడం విశేషం.
ఇక మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన గౌరీ చిందార్కర్(20) కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, నేహా(34) రచయిత మరియు ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు. మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ.. గతంలో ముంబై వీధుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. జాబితాలో ఇండియా నుంచి చోటు దక్కించుకున్నవారిలో కురు వృద్దురాలు సాలుదా తిమ్మక్క (105) కూడా ఉన్నారు. గత 80ఏళ్లలో 8వేలకు పైగా మొక్కలను నాటడం ద్వారా ప్రముఖ పర్యాణవేత్తగా ప్రసిద్ది పొందారు. బీబీసీ 100మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్కనే అత్యంత వృద్దురాలు కావడం గమనార్హం.