కోస్తా తీర గ్రామాల్లో అలజడి: భారీగా మోహరించిన ఎన్డీఆర్ఎఫ్: మైకుల ద్వారా హెచ్చరిస్తూ..
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఎంఫాన్ (Amphan) సూపర్ సైక్లోన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వచ్చే 24 గంటల్లో ఈ తుఫాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను సమీపించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాన్ ప్రభావం వల్ల తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయిస్తున్నాయి. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మందిని తుఫాన్ షెల్టర్లకు తరలించినట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.
Recommended Video
సూపర్ సైక్లోన్ ఎంఫాన్: మూడు రాష్ట్రాలు గజగజ: ఏపీ సహా: ప్రధాని అత్యవసర భేటీ: ఆ జిల్లాల్లో
బలహీన పడే అవకాశం ఉన్నా..
ఎంఫాన్ తుఫాన్ వచ్చే ఆరు నుంచి 12 గంటల వ్యవధిలో క్రమంగా బలహీన పడుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తీరాన్ని తాకడానికి ముందే బలహీనపడొచ్చని చెప్పారు. సూపర్ సైక్లోన్ స్థాయి నుంచి తుఫాన్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దాని తీవ్రత తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ఈదురు గాలుల తీవ్రత వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించడానికి అవకాశాలు లేకపోలేదని తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల తాజా హెచ్చరికలతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాయి.
తీర ప్రాంతాల్లో హెచ్చరికలు..
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నాయి. జగత్సింగ్ పూర్, భద్రక్, గంజాం, పూరీ కేంద్రపారా జిల్లాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను మోహరింపజేసింది ఒడిశా ప్రభుత్వం. మైకుల ద్వారా తుఫాన్ తీవ్రత గురించి గ్రామస్తులను హెచ్చరిస్తూ వారిని అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. తుఫాన్ ప్రభావానికి గురయ్యే పశ్చిమ బెంగాల్లోనూ దాదాపు ఇవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ 24 పరగణ, ఉత్తర 24 పరగణ, మిడ్నాపూర్ జిల్లాల్లో తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
170 కిలోమీటర్ల వేగంతో..
ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని ఉత్తరాంధ్రపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఒడిశాలోని కేంద్రపారా, పశ్చిమ బెంగాల్లోని దిఘా పట్టణం మధ్య తుఫాన్ తీరం దాటడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. తుఫాన్ తన దిశను మార్చుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో కల్లోలాన్ని మిగిల్చవచ్చని వెల్లడించారు.
మత్స్యకారుల ముందుజాగ్రత్త..
తుఫాన్ రాకను దృష్టిలో ఉంచుకుని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మత్స్యకారులు ముందుజాగ్రత్త చర్యలను చేపట్టారు. సముద్ర తీర ప్రాంతాలను ఖాళీ చేశారు. జీవనాధారమైన వలలను తమ వెంట తుఫాన్ షెల్టర్లకు తీసుకెళ్తున్నారు. సముద్ర తీరంలో కట్టి ఉంచిన పడవలను ఒడ్డుకు చేర్చుతున్నారు. మరో 72 గంటల పాటు చేపల వేటను నిషేధించాయి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలను జారీ చేశాయి. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 12 గంటలకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో సమావేశం కానున్నారు.