Coronavirus:సూపర్ స్ప్రెడర్గా సభలు సమావేశాలు - అక్కడినుంచే: నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే..?
కరోనా వైరస్ కేసులు భారత్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితిని పరిశీలిస్తే అంతే క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇక కొత్తగా పెరుగుతున్న కేసులు ఎక్కువగా కొత్త స్ట్రెయిన్కు సంబంధించినవనే చర్చ ప్రారంభమైంది. అయితే ఈ చర్చను నిపుణులు తప్పుబడుతున్నారు. కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం కొత్త స్ట్రెయిన్ కాదని పెద్ద ఎత్తున జనాలతో కూడిన కార్యక్రమాలే అని చెబుతున్నారు. అవును ఒక వేడుక లేదా ఏదైనా రాజకీయ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఇక్కడి నుంచి కరోనావైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు సూపర్ స్ప్రెడర్ ద్వారా వచ్చినవే అని నిపుణులు చెబుతున్నారు.
ఇక సభలకు ఆయా కార్యక్రమాలకు ప్రజలు హాజరుకావడం అందులో ఎవరికైనా ఒకరికి కరోనా సోకి ఉండి ఉంటే వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందడం ... అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేయడంతోనే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని కర్నాటకలోని ఓ నిపుణుడు చెప్పారు.వీరే సూపర్ స్ప్రెడర్స్గా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.అంతేకాదు ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు, జాగ్రత్తలు, ట్రాకింగ్ వంటి అంశాలపై స్థానిక ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే మహారాష్ట్రలో కనిపించిన వేరియంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదనలో వాస్తవం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వైరస్ మార్పులు కనిపించాయని వివరించారు. జన్యుక్రమంను నిమ్హాన్స్లో పరీక్షిస్తున్నామని చెప్పారు. 440 మరియు 480 మ్యూటేషన్స్ వేర్వేరుగా ఉన్నట్లు తాము గమనించామని చెప్పారు. ఈ రెండు కరోనా వేరియంట్లు లాక్డౌన్ తర్వాత వ్యాప్తి చెందాయని వెల్లడించారు. ఇక ఈ రెండు కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా అని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.
ఇక కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా గైడ్లైన్స్ మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని.. ఈ సమయంలో గట్టి నిఘాతో పాటు వ్యాధిని నియంత్రించడం, జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించరాదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.