తలైవాకు ఇది స్పెషల్ బర్త్ డే.. మోదీ విషెస్... ఢిల్లీలో మక్కల్ మండ్రం.. కీలక ప్రకటన వచ్చే ఛాన్స్?
సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు(డిసెంబర్ 12) 70వ వడిలోకి అడుగుపెట్టారు. ఇటీవలే రాజకీయ ప్రకటనతో తమిళ పాలిటిక్స్లో హీట్ పుట్టించిన రజనీకి ఈ బర్త్ డే ప్రత్యేకమనే చెప్పాలి. గతేడాది వరకు ఓ సినీ నటుడిగా రజనీ బర్త్ డేని సెలబ్రేట్ చేసిన అభిమానులు... ఇప్పుడు ఆయన్ను భవిష్యత్ రాజకీయ రథసారథిగా కీర్తిస్తూ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. సినీ రంగంలో శిఖర స్థాయి పేరు,ప్రతిష్ఠలను సంపాదించుకున్న రజనీకాంత్... రాజకీయంలో ఏ మేరకు రాణించగలరన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుదీర్ఘ కాల తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తలైవా... ఇప్పటికే పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ వేళ... ఆయన 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని బర్త్ డే విషెస్...
సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. మరోవైపు రజనీ అభిమానులు #HBDSuperstarRajinikanth హాష్ ట్యాగ్తో ట్విట్టర్ను షేక్ చేస్తున్నారు. రజనీ స్టైల్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. సినీ పరిశ్రమలో ఒక నటుడు 50 ఏళ్ల పాటు ఇంత భారీ స్థాయిలో అటెన్షన్ని,సక్సెస్ని,ఫాలోయింగ్ని కలిగి ఉండటం ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదు అని అభిప్రాయపడుతున్నారు.
పుట్టినరోజు కీలక ప్రకటన ఏదైనా...?
అన్ని కుదిరితే వచ్చే ఏడాది జనవరిలో రజనీకాంత్ పార్టీ ఆవిర్భావం జరగనుంది. ఇప్పటికే రజనీ అభిమాన సంఘం మక్కల్ మండ్రం నేతలు ఢిల్లీలో పాగా వేసి పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవాళ రజనీ పుట్టినరోజు కావడంతో అభిమానులను ఖుషీ చేసేలా ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ప్రతీ ఏడాది ఆయన పుట్టినరోజున కొత్త సినిమా టీజర్,ట్రైలర్ ఇలా ఏదో ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేవారు. ఈసారి సందర్భం పొలిటికల్ నేపథ్యంతో కూడినది కావడంతో పార్టీకి సంబంధించి అభిమానుల కోసం రజనీ ఏదైనా ప్రకటన చేస్తారా అన్న సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా తలైవా తమ రథసారథి అంటూ అభిమానులు ఫ్లెక్సీలతో హడావుడి మొదలుపెట్టేశారు.
ఏ భావజాలంతో రజనీ రాజకీయం..
సాధారణంగా రాజకీయ పార్టీ అనగానే ఏ భావజాల పునాదులపై దాన్ని నిర్మించబోతున్నారన్న చర్చ సహజం. రజనీకాంత్ పెట్టబోయే పార్టీ ఆధ్యాత్మిక,లౌకిక రాజకీయాలు చేస్తుందని ప్రకటించారు. ఇది ఒకింత కన్ఫ్యూజన్గానే ఉంది. ఆధ్యాత్మికత అంటే రజనీకాంత్ రైట్ వింగ్ రాజకీయాలు చేయబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన బీజేపీకి బీ టీమ్గా పనిచేయబోతున్నారని.. ఏళ్లుగా తమిళనాడులో పాగా వేయాలన్న కలను బీజేపీ రజనీ ద్వారా నెరవేర్చుకోబోతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రజనీ పార్టీ ఏర్పాటు వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉన్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ ఇదివరకే ఆరోపించారు.
Recommended Video
రజనీ వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు...
రజనీకాంత్ ఎవరికో బయపడి, బెదిరింపులకు తలొగ్గి, ఒత్తిడికి గురై పార్టీ ఏర్పాటు ప్రకటన చేసినట్టుగా కనిపిస్తోందని తిరుమావళవన్ కొద్దిరోజుల క్రితం పేర్కొన్నారు.అటు వామపక్ష నాయకులు కూడా ఇదే అనుమానం వెలిబుచ్చుతున్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆర్జున్ మూర్తికి, అన్ని పార్టీలను చుట్టి వచ్చిన తమిళరివి మణియన్లకు రాగానే పదవిని కట్టబెట్టడం చూస్తే... ఆయన రాజకీయ వైఖరేంటో అర్థమవుతోందని సీపీఎం నేత బాలకృష్ణన్ పేర్కొన్నారు. అంతేకాదు,రజనీకాంత్ పగటి కలలు కంటుతున్నారని విమర్శించారు. ఇన్ని విమర్శల నడుమ మొదలవనున్న రజనీకాంత్ రాజకీయ ప్రయాణం చివరకు ఎక్కడికి చేరుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.