రజనీకాంత్ కామెంట్స్ రచ్చ..! తలైవాను చుట్టుముట్టిన రాజకీయ వివాదాలు..!
చెన్నై: రాజకీయాల్లో ఉండీ లేనట్టు, అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తోన్న దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ఒకే ఒక్క కామెంట్.. తమిళనాడు రాజకీయాల్లో మంట పుట్టించింది. రచ్చ రచ్చ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఏకమౌతున్నాయి. బహుభాషా నటుడు కమల్ హాసన్ నెలకొల్పిన మక్కళ్ నీథి మయ్యం, డీఎంకే, ఎండీఎంకే.. రజినీకాంత్ కామెంట్లపై ఓ చిన్నస్థాయి యుద్దానికి దారి తీసే పరిస్థితులను కల్పించారు. రజినీకాంత్ తన ముసుగును తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇక ఆయన కాషాయ కండువాను నిరభ్యంతరంగా కప్పుకోవచ్చని మండిపడుతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించి కూడా రజినీకాంత్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి అసలు కారణం.. భారతీయ జనతాపార్టీతో దోస్తీ చేయడమేనని, అది ఇప్పుడు స్పష్టమైందని విమర్శిస్తున్నారు.
వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారు
గొడవ ఎక్కడొచ్చిందంటే..!
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 330 సంఘటనలతో కూడిన ఓ పుస్తకాన్ని రూపొందించారు. దీని పేరు లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్. ఈ పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రజినీకాంత్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై రజినీకాంత్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఆయన ఆకాశానికి ఎత్తేశారు. వారిద్దరూ కృష్ణార్జున స్వరూపాలని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని, సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా.. ఆధునిక కృష్ణార్జునులు అని చెప్పారు. వారిలో ఎవరు అర్జునుడో, ఎవరు కృష్ణుడో తనకు తెలియదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ విషయం వారే తేల్చుకోవాలని సూచించారు. దశాబ్దాలుగా చిక్కుముడి వీడని కాశ్మీర్ సమస్యకు మోడీ-అమిత్ షా చిటికెలో పరిష్కరించారని చెప్పారు. ఆర్టికల్ 370 బిల్లు సందర్భంగా ఉభయ సభల్లో అమిత్ షా చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని అన్నారు.
తేడా కొట్టిందక్కడే..
రజినీకాంత్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని, ఆయన ఈ స్థాయిలో బీజేపీ నేతలను ఆకాశానికెత్తేస్తారని ఎవ్వరూ పెద్దగా ఊహించలేదు. బీజేపీకి మద్దతుదారునిగా మాత్రమే ఉన్నారని భావిస్తూ వచ్చిన అభిమానులు.. తాజాగా రజినీకాంత్ చేసిన కామెంట్లతో షాక్ కు గురయ్యారు. తమిళనాడులో బీజేపీకి ఏ మాత్రం ఆదరణ లేదు. హిందీ పార్టీ అనే ముద్ర బీజేపీపై ఉంది. దేశమంతా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచినప్పటికీ.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులో ఒక్క స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయింది. అధికారంలో ఉన్న అన్నా డీఎంకెతో కలిసి పొత్తు పెట్టుకుని, సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ.. లోక్ సభ స్థానాల్లో పాగా వేయలేకపోయింది. కమలం పార్టీ అంటే తమిళులకు ఉన్న అయిష్టతకు నిదర్శనంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలను చెప్పుకోవచ్చు. అలాంటి పార్టీని రజినీకాంత్ ఆకాశానికెత్తేయడం ఏ మాత్రం నచ్చలేదని తెలుస్తోంది.
కత్తులు నూరుతున్న ప్రత్యర్థులు..
అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం రాజకీయ విమర్శల తీవ్రత పెరగడానికి మరింత కారణమైంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు అన్నా డీఎంకేని, ఇటు బీజేపీని ఏకి పారేయడానికి రెడీ అవుతున్నారు ప్రత్యర్థి పార్టీలు. మక్కళ్ నీథి మయ్యం, డీఎంకే, ఎండీఎంకే వంటి పార్టీలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యానాలతో ఆయన రంగేమిటో తెలిసిపోయిందని తోటి నటుడు, మక్కళ్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆయన తన ముసుగును తొలగించుకోవాలని, ఇక పూర్తి స్థాయిలో బీజేపీలో చేరిపోవాలని సలహా ఇస్తున్నారు. కొత్త పార్టీ పేరుతో అటు అభిమానులు, ఇటు తమిళ ప్రజలను మోసం చేయడాన్ని మానుకోవాలంటూ ప్రత్యర్థులు చురకలు అంటిస్తున్నారు .తాజా రాజకీయ దుమారంపై రజినీకాంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.