క్లైమాక్స్ లో సూపర్ స్టార్ ఎంట్రీ! సుమలత కోసం.. చివరిరోజు రోడ్ షో, బహిరంగ సభ!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రముఖ నటి సుమలతకు మద్దతుగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. రెండో దశ పోలింగ్ సందర్భంగా కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. ఈ లోగా రజినీకాంత్ మండ్యలో రోడ్ షోలో పాల్గొనే అవకాశాాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం కార్యక్రమాల క్లైమాక్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు.
అంబరీష్ కు ఆప్తమిత్రుడు..
సుమలత కుటుంబానికి రజినీకాంత్ ఆప్తమిత్రుడు. సుమలత భర్త, అంబరీష్ రజినీకాంత్ మంచి స్నేహితులు కూడా. పైగా భారతీయ జనతాపార్టీ కర్ణాటక రాష్ట్రశాఖ లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మండ్య లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. రజినీకాంత్ బీజేపీకి దగ్గరి వ్యక్తి. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రజినీకాంత్ మండ్యకు రానున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రజినీకాంత్ మండ్య నియోజకవర్గంలో పర్యటిస్తారని చెబుతున్నారు. సుమలత, ప్రముఖ కన్నడ నటులు యశ్, దర్శన్ లతో కలిసి రజినీకాంత్ రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం.
నిఖిల్ కోసం చంద్రబాబు..
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. జేడీఎస్ నాయకుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, జాగ్వార్ ఫేమ్ నటుడు నిఖిల్ కుమార్ గౌడ మండ్య నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల పోటీ రసవత్తరంగా మారింది. సుమలత, నిఖిల్ గౌడ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. నిఖిల్ కు మద్దతుగా కుమారస్వామి, దేవేగౌడ ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిఖిల్ మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు.
రజినీ రాక వల్ల లాభమా? నష్టమా?
మరోవైపు- సుమలతకు శాండిల్ వుడ్ మద్దతుగా నిలిచింది. ప్రముఖ నటులు యశ్ (కేజీఎఫ్ ఫేమ్), దర్శన్ సుమలత కోసం పలుమార్లు మండ్యలో ప్రచారాన్ని చేశారు. అంబరీష్ అభిమానుల సంఘం కూడా సుమలతకు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో- రజినీకాంత్ కూడా సుమలత కోసం ప్రచారానికి వస్తే.. దాని తీవ్రత పతాకస్థాయికి చేరుకున్నట్టవుతుంది. రజినీకాంత్ ఎన్నికల ప్రచారానికి రావడం వల్ల సుమలతకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం- కావేరీ జలాల పంపకాల గొడవలు.
కర్ణాటక-తమిళనాడు మధ్య కొన్నేళ్లుగా కావేరీ జలాల పంపకాల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. కర్ణాటకకు మించి తమిళనాడుకు అధిక వాటా కేటాయించడం పట్ల పలుమార్లు నిరసనలు వ్యక్తమయ్యాయి. బంద్ లు జరిగాయి. కావేరీ జలాల వివాదంలో రజినీకాంత్ ముందు నుంచీ తమిళనాడుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రజినీకాంత్ ఎన్నికల ప్రచారంలో గనక పాల్గొంటే.. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి జనతాదళ్ (సెక్యులర్) రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కావేరీ నదిపై కట్టిన కేఎస్ఆర్ రిజర్వాయర్ కూడా మండ్య లోక్ సభ పరిధిలోనే ఉంది.