అప్.. అప్.. అండ్ అవే: చెన్నై రహదారిపై సూపర్ మ్యాన్ ప్రత్యక్ష్యం...ఎందుకో చూడండి
Recommended Video
మీరు ట్రాఫిక్లో వెళుతున్నారు. అనుకోకుండా సిగ్నల్ పడింది. మీరు రెడ్ సిగ్నల్ గమనించకుండా అలానే ముందుకు వెళ్లారు. అప్పుడే మీముందు బ్యాట్ మ్యాన్ వచ్చి... ట్రాఫిక్ సిగ్నల్స్ను ఫాలో అవ్వండి అని క్లాస్ తీసుకుని, సీటు బెల్టు ధరించమని గుర్తు చేస్తే ఎలా ఉంటుంది...? ఇది చదువుతున్న మీకైతే ఎలాగుంటుందో తెలియదుకానీ...చెన్నై నగరవాసులు మాత్రం ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు.
జూన్ 24న అన్నానగర్ సిగ్నల్ దగ్గర వాహనదారుల ముందు ఒక్కసారిగా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్లు ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా వాహనదారులు షాక్కు గురయ్యారు. అయితే వాళ్లు ఊరికే రాలేదులెండి. తమకంటూ ఒక మిషన్ను పూర్తి చేసేందుకే అలా వచ్చారు. ఇంతకీ ఆ మిషన్ ఏంటనేగా..? చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు థోజన్ అనే ఓ ఎన్జీఓ సంస్థ ముగ్గురికి ఇలా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ గెటప్లు వేసి పంపింది.
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2013 నుంచే తము ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తెచ్చేలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని ఎన్జీఓ సంస్థ తెలిపింది. అంతకుముందు యమధర్మ రాజు గెటప్లో వచ్చి ప్రాణాల విలువ గురించి చెప్పినట్లు వారు తెలిపారు. 2007లో థోజన్ సంస్థను కొందరు మిత్రులు కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అవయవాల దానం, రహదారి భద్రత, అంతరించిపోతున్న జంతువులు, పక్షులు, నదుల అనుసంధానం లాంటి పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రచారం కూడా చేస్తున్నట్లు థోజన్ సంస్థ వెల్లడించింది. ప్రతి గురువారం ఇలా విచిత్ర వేషధారణలతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. యమధర్మరాజు వేశంలో రహదారి భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నిబంధనలపై చిత్రగుప్తుడు క్లాస్, ఫ్లాష్ మాబ్స్, మైమ్స్లో పలురకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించింది.
భారత్లో ప్రతి గంటకు 17 మంది రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్నారని థోజన్ సంస్థ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. 2016 రిపోర్టు ప్రకారం ఒక్క చెన్నై నగరంలోనే ఏడాదికి 7,486 మరణాలు రోడ్డు ప్రమాదాలతోనే సంభవించాయని చెప్పారు. రోజుకు 119 మంది చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు రాధాకృష్ణ చెబుతున్నారు. దీనికి కారణం పిల్లలు 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ కాగానే వారికి బైక్లు, కార్లు కొనిస్తున్నారని ఇదే ప్రమాదానికి దారి తీస్తోందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ గెటప్లు వేసి తమ ప్రతినిధులు చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు ఈ గెటప్స్ను బాగా ఎంజాయ్ చేస్తూనే ప్రతినిధులు చెబుతున్న నిబంధనలను జాగ్రత్తగా విన్నారని ఆనందం వ్యక్తం చేసింది థోజాన్ సంస్థ. తాము చేస్తున్న క్యాంపెయినింగ్కు చెన్నై నగరవాసుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాదు వారికి మంచి మద్దతు కూడా లభిస్తోందని థోజన్ సహవ్యవస్థాపకుడు రాధాకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.