రజనీకాంత్ వచ్చేశారు: అసెంబ్లీ సమావేశం, మరుసటి రోజే‘సూపర్’ప్లాన్, ఏం జరుగుతోంది !
తమిళనాడులో ప్రస్తుతం రజనీకాంత్ ఆ రాష్ట్ర రాజకీయ నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులతో ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సమయంలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్.
చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం రజనీకాంత్ ఆ రాష్ట్ర రాజకీయ నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులతో ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సమయంలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్ మరో సారి ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడానికి రంగం సిద్దం చేశారు.
శశికళ, దినకరన్ కు చెక్: సీన్ లోకి పళనిసామి, పన్నీర్ వర్గాలు, టార్గెట్ 2021, ఫోటోలు ప్రత్యక్షం !
గత ఫోటో సెషన్ సమయంలో రాజకీయ వ్యాఖ్యలతో వేడి పుట్టించిన రజనీకాంత్ ఈ సారి ఏం చేస్తారోనని తమిళనాడుతో సహ యావద్దేశం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. బుధవారం చెన్నైలో అడుగుపెట్టనున్న రజనీకాంత్ ను కలవడానికి మీడియా ఇప్పటికే సిద్దం అయ్యింది.
రజనీకాంత్ జపం !
తమిళనాడులో రజనీకాంత్ పేరు ఒక జపంలా మారిపోయింది. రాజకీయ వర్గాల్లో రజనీకాంత్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? రారా ? అంటూ ఓ పక్క జోరుగానే చర్చ మొదలైయ్యింది. అయితే రజనీకాంత్ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తుున్నారు.
కూల్ గా కాలా షూటింగ్ !
గత వారం క్రితం రజనీకాంత్ తన 164వ సినిమా కాలా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్న కాలా సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 28వ తేదీ ముంబై వెళ్లిన రజనీకాంత్ అక్కడి దారావి ప్రాంతంలో కాలా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయం !
కాలా సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రజనీకాంత్ బుధవారం చెన్నై తిరిగి వస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. జూన్ 15, 16వ తేదీల్లో చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో అభిమానులతో ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు.
18 జిల్లాల అభిమాన సంఘాలు టార్గెట్ !
మే నెలలో తమిళనాడులోని కన్యాకుమారి, అరియలూరు, దిండుగల్, కరూర్, తిరుచ్చి, తంజావూరు, తిరువరూర్ తో సహ 15 జిల్లాల అభిమానులతో రజనీకాంత్ ఫోటోలు దిగిన విషయం తెలిసింది. ఇంకా మిగిలి ఉన్న 18 జిల్లాల అభిమానులతో రెండు రోజుల పాటు ఫోటోలు దిగడానికి మళ్లీ రంగం సిద్దం అయ్యింది.
అసెంబ్లీ సమావేశం, ఫోటో సెషన్ కు లింక్ !
జూన్ 14వ తేదీ తమిళనాడు అసెంబ్లీ సమావేశం జరగనుంది. జూన్ 15వ తేదీన రజనీకాంత్ ఫోటో సెషన్ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు జంప్ అయ్యారు. ఈ సందర్బంలోనే రజనీకాంత్ మళ్లీ అభిమానులతో సమావేశం కావడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.
పళనిసామి ప్రభుత్వం ఉంటుందా ?
22 మంది ఎమ్మెల్యేలు జంప్ కావడతో పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే పళనిసామి ప్రభుత్వం కొనసాగుతోంది. దినకరన్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తలైవా నినాదంతో !
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం కుప్పకూలినా సరే మేము మాత్రం మా తలైవా చెప్పిన మాటే వింటామని రజనీకాంత్ అభిమానులు అంటున్నారు. రజనీకాంత్ అభిమానుల్లో ఎక్కువ శాతం మంది పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోవాలనే ఆశిస్తున్నారని వెలుగు చూసింది.
భారీ బందోబస్తూ !
ప్రస్తుతం రజనీకాంత్ ఇంటిలో అడుగు పెట్టినా, ఇంటి నుంచి కాలు బయట పెట్టినా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముంబై నుంచి రజనీకాంత్ చెన్నై తిరిగి వస్తున్న సందర్బంలో పోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మీ అంతు చూస్తాం !
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని కొన్ని తమిళ సంఘాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి తమిళనాడు ప్రజలకు ఎలా సేవ చేస్తాడు ? అంటూ వివాదానికి తెరలేపి ఆయన ఇంటి దగ్గర ఇప్పటికే ఆందోళలు చేశారు. ఇక ముందు రజనీకాంత్ ఇంటి దగ్గర ఎవరైనా ఆందోళన చెయ్యడానికి ప్రయత్నిస్తే తగిన బుద్ది చెబుతామని ఆయన అభిమానులు హెచ్చరిస్తున్నారు.