కర్ణాటకకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ కామెంట్, ఆత్మహత్య చేసుకుంటా !
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా, తమిళనాడు రైతులకు మద్దతుగా స్పంధించారు. తమిళనాడు-కర్ణాటక అంతరాష్ట్ర నదీ జలాల పంపిణి విషయంలో తమిళనాడు రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని సోషల్ మీడియాలో రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై కమల్ స్పంధించారు. ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడీఎంకే ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు
కావేరీ నీరు పంపిణి విషయంలో తమిళనాడుకు న్యాయం జరగాలంటే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడం ఒక్కటే మార్గమని గురువారం సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేశారు. తమిళనాడుకు నీరు పంపిణి చేసే విషయంలో పరిష్కారం లభించాలంటే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని రజనీకాంత్ కేంద్రానికి మనవి చేశారు.
డెడ్ లైన్ రోజు
దశాభ్దాలుగా నలుగుతున్న కావేరీ నీటి పంపిణి విషయంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు 2018 ఫిబ్రవరి 16వ తేదీ తుది తీర్పు చెప్పింది. ఆరు వారాల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మార్చి 29వ తేదీ గురువారంతో సుప్రీం కోర్టు ఇచ్చిన గడుపు పూర్తి అయ్యింది.
రజనీపై కమల్ కామెంట్
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసి తమిళనాడు రైతులకు న్యాయం చెయ్యాలని రజనీకాంత్ డిమాండ్ చెయ్యడంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, హీరో కమల్ హాసన్ స్పంధించారు. రజనీకాంత్ డిమాండ్ ను తాను స్వాగతిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు.
ఆత్మహత్య చేసుకుంటా
గురువారం పార్లమెంట్ లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎంపీ ఏ. నవనీతక్రిష్ణన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నాడీఎంకే ఎంపీ నవనీతక్రిషన్ డిమాండ్ కు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యురాలు, కరుణానిధి కుమార్తె కనిమోళి మద్దతు తెలిపారు.