కాలాకు మైసూరులో మోక్షం: మల్టీఫ్లెక్స్ ల ధైర్యం, వందల మంది పోలీసులు, ఫ్యాన్స్ ఎంజాయ్ !
బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమాకు కర్ణాటకలో భారీ దెబ్బపడింది. కాలా సినిమా షోలు మొదలైనా కొన్ని ప్రాంతాల్లో సగంలోనే సినిమా ప్రదర్శనలు నిలిపేశారు. అయితే మైసూరు నగరంలో రెండు మల్టీఫ్లెక్స్ ల్లో భారీ పోలీసు బందోబస్తుతో ధైర్యం చేసి కాలా సినిమా విడుదల చెయ్యడంతో రజనీకాంత్ అభిమానులు, సినీ ప్రేక్షకులు హాయిగా సినిమా చూస్తున్నారు.
మైసూరు నగరంలో కాలా సినిమాను విడుదల చెయ్యడానికి సినిమా థియేటర్ల యాజమాన్యం వెనకడుగు వేసింది. మద్యాహ్నం వరకూ మైసూరులో కాలా సినిమా ప్రదర్శించడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేదు. అయితే భారీ పోలీసు బందోబస్తుతో రెండు మల్టీ ఫ్లెక్స్ ల్లో కాలా సినిమా విడుదల చేశారు.
మైసూరులోని ఐనాక్స్, డీఆర్ సీ మల్టీఫ్లెక్స్ ల్లో కాలా షోలు ప్రారంభం అయ్యాయి. కాలా సినిమా ప్రదర్శిస్తున్నారని తెలుసుకున్న రజనీకాంత్ అభిమానులు మల్లీఫ్లెక్స్ ల ముందు క్యూకట్టారు. నేరుగా టిక్కెట్లు తీసుకుని కాలా సినిమా చూస్తున్నారు.
మల్టీ ఫ్లెక్స్ ల బయట, లోపల వందల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు సైతం భద్రతా ఏర్పాట్లలో భాగంగా కాలా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మైసూరులో కాలా సినిమా విడుదలకు సహకరించిన పోలీసులకు రజనీకాంత్ అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు.