వా..వా.. తలైవా: తన కోసం కాదు సుజిత్ కోసం ప్రార్థించండంటోన్న రజినీ..!
చెన్నై: కోలీవుడ్ వెండితెర ఇలవేల్పు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. సుమారు 70 అడుగుల లోతు మేర బోరుబావిలో చిక్కుకుని పోయిన రెండేళ్ల సుజిత్ విల్సన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుజిత్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుతూ ప్రార్థించాలని తన అభిమానులకు సూచించారు. సుజిత్ ప్రాణాలతో వస్తాడనే తాను ఆశిస్తున్నానని చెప్పారు. దీపావళి పండుగ సమయంలో ఈ ఘటనను తనను కలచి వేసిందని రజినీకాంత్ అన్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని వందలాది మంది రజినీకాంత్ అభిమానులు ఆదివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అభిమానులను రజినీకాంత్ నిరాశకు గురి చేయలేదు. వారికి చిరునవ్వుతో పలకరించారు. అభివాదం చేస్తూ, చాలాసేపు గడిపారు.
Tamil Nadu: Superstar and politician Rajinikanth meets his fans outside his residence, in Chennai, to wish them on #Diwali today. pic.twitter.com/Y7pPOTvpfw
— ANI (@ANI) October 27, 2019
ఈ సందర్భంగా రజినీకాంత్ అక్కడే మీడియాతో మాట్లాడారు. సుజిత్ విల్సన్ బోరుబావిలో చిక్కుకునిపోవడం తనను కలచివేసిందని అన్నారు. సుజిత్ సురక్షితంగా ఉంటాడని, ప్రాణాలతో బయటికి వచ్చి, తమను పలకరిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పండుగ సమయంలోనూ లక్షలాది మంది అభిమానులు తన కోసం ప్రార్థనలు నిర్వహిస్తుంటారని, ఈ సారి సుజిత్ విల్సన్ కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు. సాంకేతికపరంగా దేశం ఎన్నో అద్భుతాలను సృష్టించినప్పటికీ.. బోరుబావిలో చిక్కుకున్న పిల్లలను వెలికి తీయలేకపోవడం బాధాకరమని అన్నారు.
సుజిత్ వెలికితీత పనుల్లో తీవ్ర జాప్యం..
శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన తండ్రికి చెందిన మొక్క జొన్న పొలంలో ఆడుకుంటూ దురదృష్టవశావత్తూ సుజిత్ బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడిని సజీవంగా వెలికి తీయడానికి అధికార యంత్రాంగం చేస్తోన్న ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడింది. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్వుతున్న సమయంలో మధ్యలో రాళ్లు ఎదురయ్యాయి. వాటిని తొలగించడానికి బోర్లను వేసే యంత్రాలను తెప్పించారు అధికారులు. గుట్టగా ఉన్న రాళ్లను పగులగొడుతూ భూమిని తొలుస్తున్నారు.