పరాకాష్టకు చేరిన మూఢనమ్మకం..! ప్రభుత్వ ఆస్పత్రిలో మాంత్రికుడి వైద్యం..!!
భోపాల్/హైదరాబాద్ : ఇది సభ్య సమాజం గర్వించాలా.. సిగ్గుతో తల దించుకోవాలో అర్థం కాని వార్త. దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నా, మూఢ నమ్మకాల చీకట్లు తొలగడం లేదు. కంప్యూటర్ యుగంలో కూడా బాబాలు, మాంత్రికులనే ప్రజలు నమ్ముతున్నారు. మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న ఆరాచకాలు ఇంకా తగ్గలేదని రుజువు చేసే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లో జరిగింది. ఓ యువతి పాము కాటుకు గురికాగా, ఆసుపత్రిలో చేరిన ఆమెకు నయం చేయాలంటే భూత వైద్యుడు రావాల్సిందేనని చెప్పి, ఓ మంత్రగాడిని కుటుంబ సభ్యులు పిలిపించారు. డాక్టర్ల వైద్యం వద్దంటూ, ఆసుపత్రి ఆవరణలోనే తాంత్రిక పూజలు చేశారు. విషం పోవాలంటే, నగ్నంగా ఉండాలంటూ, ఆమె ఒంటిపై దుస్తులు ఊడదీసి అవమానించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది చూస్తూనే ఉన్నా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలోని భతియాగర్ గ్రామ నివాసి అయిన ఇరవై ఐదు సంవత్సరాల ఇమ్రాత్ దేవి గత ఆదివారం పాము కాటు గురైయ్యారు. చికిత్స కోసం అదే రోజు రాత్రి దామోలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మహిళల వార్డులో ఆమెను చేర్చి వైద్యం అందించారు. కాగా అదే రోజు రాత్రి దేవి బంధువులు ఓ మంత్రగాడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ల వైద్యంకి పాము కాటు నయం కాదని, మంత్రాలతోనే నయమవుతుందని ఆచారం పేరుతో ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించి కొన్ని మంత్రాలు చదివాడు ఆ మంత్రగాడు. ఇదంతా ఆస్పత్రి ఆవరణలో జరిగినా సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఓ నర్సు ఈ ఘటనను చూసిందని, కానీ ఆమె డాక్టర్లకు,సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదని అన్నారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకి మంత్రాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండటం దురదృష్టకరమని అన్నారు.