సూర్యగ్రహణం వేళ దారుణం.. సొంత బిడ్డల్ని మట్టిలో పాతిపెట్టారు.. మంత్రగాళ్ల మాటలు నమ్మి..
సూర్యగ్రహం సందర్భంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో మూఢనమ్మకాలు హెచ్చరిల్లాయి. గురువారం ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం.. 9.04 గంటలకు సంపూర్ణ స్థితికి చేరుకుని.. 10.47 గంటలకు ముగిసింది. గ్రహణంలో కీలకమైన సమయంలో జరిగిన అమానుష సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కర్నాటకలో చోటుచేసుకున్న ఘటన సంచలనం రేపుతున్నది.
సంపూర్ణ సూర్యగ్రహణం .. చాలా పవర్ఫుల్ .. ఎలా పడితే అలా చూస్తే యమా డేంజర్ .. ఎందుకంటే
తల్లిదండ్రులే పిల్లల్ని పాతిపెట్టారు..
కర్నాటకలోని కలబుర్గి ప్రాంతంలో మూఢనమ్మకాలకు చెందిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. ఇక్కడి తాజ్ సుల్తాన్ పూర్ అనే గ్రామంలో ఇవాళ సూర్యగ్రహణం సందర్భంగా చాలా తంతు జరిగింది. గ్రహణం టైమ్ లో అంగవైకల్యం ఉన్న పిల్లల్ని మెడలోతు మట్టిలో పాతిపెడితే.. వాళ్ల వైకల్యం పోతుందని స్థానికులు నమ్ముతారు. సరిగ్గా గ్రహణం మొదలయ్యే సమయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలతో సహా సుల్తాన్ పూరర్ కు చేరుకున్నారు.
వరుసగా బొందలు తొవ్వి..
రెండు మూడేండ్ల పిల్లల నుంచి పది పదిహేను సంవత్సరాలున్న పిల్లల్ని వరుసగా పాతిపెట్టిన ద్రుశ్యాలు కలకలం రేపాయి. తల్లిదండ్రులే దగ్గరుండి మరీ బొందలు తొవ్వి.. పిల్లల్ని వాటిలోకి దింపి.. గ్రహణం పూర్తయ్యేంత వరకు పూడ్చిపెట్టారు. మెడలోతు మట్టిలో ఊపిరాడక పిల్లలు హాహాకారాలు చేసినా ఏ ఒక్కరూ చలించలేదు. పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతమంతా స్మశానాన్ని తలపించింది.
డాక్టర్లకు చూపించినా ఫలితం లేదని..
కలబుర్గి ప్రాంతంలో కొందరు తల్లిదండ్రులకు వ్యాక్సిన్లపై సరైన అవగాహన లేకపోవడం పిల్లలకు శాపంగా మారింది. పిల్లలు అంగవైకల్యానికి గురైన తర్వాతకూడా తల్లిదండ్రులు మాయమంత్రాలనే నమ్ముతుండటం గమనార్హం. డాక్టర్లకు చూపించినా ఫలితం రాలేదని, గ్రహణం టైమ్ లో మట్టిలో పాతిపెడితే అంగవైకల్యం పోతుందని తెల్సిన మంత్రగాళ్లు సలహా ఇచ్చారని, ఆ మేరకు సుల్తాన్ పూర్ వచ్చామని ఓ మహిళ చెప్పింది. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇంకా స్పందిచలేదు.