ఇ-కామర్స్ కంపెనీలకు షాక్: సడలింపు జాబితా నుంచి తొలగింపు: మినహాయింపు వాటికి మాత్రమే..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్ కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ తరువాత ఇ-కామర్స్ సంస్థలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తామంటూ ఇదివరకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిబంధనలను సవరించింది. ఇ-కామర్స్ సంస్థలను ఈ మినహాయింపు జాబితా నుంచి తొలగించింది. నిత్యావసర సరుకుల సరఫరాకు మాత్రమే మినహాయింపునిచ్చింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం తాజా ఆదేశాలను జారీ చేసింది. ఇ-కామర్స్ సంస్థలకు అన్ని రకాల వస్తువులను సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా.. ఆయా సంస్థల డోర్ డెలివరీ కార్యకలాపాలు విస్తృతంగా పెరుగుతాయని కేంద్రం అంచనా వేసింది. ఫలితంగా- సోషల్ డిస్టెన్సింగ్ కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికీ కారణమౌతుందని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఇదివరకు దేశ రాజధానిలో పిజ్జా డెలివరీ బాయ్కు కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని మాలవీయ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ద్వారా 72 కుటుంబాలు స్వచ్ఛందంగా క్వారంటైన్కు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇ-కామర్స్ సంస్థలకు సడలింపు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల డోర్ డెలివరీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కేంద్రం అనుమానిస్తోంది.
Recommended Video
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇ-కామర్స్ సంస్థల కార్యకలాపాలపై నిషేధాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిత్యావసర సరుకులను మాత్రమే డోర్ డెలివరి చేయాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. డోర్ డెలివరీ చేసే సమయంలో సంబంధిత సంస్థ గానీ, ఉద్యోగులు గానీ, ఇతర సిబ్బంది లాక్డౌన్ నిబంధనలను పాటించాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యను చేపట్టాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.