శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలు ఎంట్రీ, సుప్రీం కోర్టులో విచారణ వాయిదా !
న్యూఢిల్లీ: కేరళ శబరిమల ఆలయంలో అయ్యస్వామిని మహిళలు గర్బగుడిలో దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు దాఖలు అయిన పిటీషన్లు నవంబర్ 13వ తేదీ విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను అయప్పస్వామి ఆలయ కమిటీ నిర్వహకులు, వివిధ సంఘ, సంస్థలు సవాలు చేస్తూ సుప్రీం కోర్టులోని అత్యున్నత స్థాయి బెంచ్ లో పిటిషన్లు దాఖలు చేశారు.
శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించడంపై మళ్లీ విచారణ చెయ్యాలని దాదాపు 18కి పైగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. మంగళవారం (అక్టోబర్ 23) సుప్రీం కోర్టులో పిటిషన్లు విచారణకు వచ్చాయి. మహిళలు అయ్యప్పస్వామి ఆలయంలో ప్రవేశించకుండా చూడాలని, వెంటనే విచారణ చెయ్యాలని పిటిషనర్లు కోర్టులో మనవి చేశారు.
శబరిమలలో మహిళలు ప్రవేశించే విషయంపై దాఖలు అయిన పిటిషన్లు అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు విచారణ నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. సుమారు 800 ఏళ్ల చరిత్ర ఉన్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా చూడాలని ఆలయం కమిటీ సభ్యులతో పాటు లక్షాలాధి మంది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సెప్టెంబర్ 28వ తేదీ సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.