గవర్నర్కు నోటీసు: తప్పిదమని అంగీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై నమోదైన కేసుల్లో భాగంగా ఆ రాష్ట్ర గవర్నర్కు నోటీసు జారీ చేయడం తప్పిదమని సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. రాజ్యాంగంలోని 361వ ఆర్టికల్ ప్రకారం ప్రకారం కోర్టు విచారణల నుంచి గవర్నర్కు పూర్తి మినహాయింపు ఉంటుందన్న విషయాన్ని వెల్లడించింది.
దీనికి సంబంధించి గతంలో తానే ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, అరుణాచల్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాకు జనవరి 28వ తేదీన జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకుంది. ఈ ఉత్తర్వులు గవర్నర్ తన అభిప్రాయాలను కోర్టుకు సమర్పించకుండా నిరోధించబోవని జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా, అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకి, కాంగ్రెస్ నేత బమాంగ్ ఫెలిక్స్లు కొత్తగా వేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి తాజా నోటీసులు జారీ చేసింది. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ప్రధాన కార్యాలయంగా రాజ్ భవన్ను ఉపయోగించుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణను గవర్నర్ ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తున్నానని తెలిపారు. ‘‘నేను రాజకీయేతర వ్యక్తిని. రాజ్భవన్ను రాజకీయ పార్టీల కార్యాలయం లాగా ఎన్నడూ వినియోగించలేదు. ఏ రాజకీయ పార్టీలకూ నేను అనుకూలంగా లేను. నేను ఎవరికీ ఏజెంటును కాను'' అని ఆయన పేర్కొన్నారు.