ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ చట్టంపై రిజర్వ్ లో ఉంచిన తుది తీర్పును పున:సమీక్షించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అనేక కారణాల వల్ల ఈ చట్టాన్ని నీరుగారుతోందని, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయని, దీన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ దిశగా కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది.
షాకింగ్: సిటీ బస్సుల్లోనూ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం: టికెట్ తో పాటు చలాన్ కూడా!
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి..
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బీఆర్ గావైలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ ఎప్పుడు ఆరంభమౌతుందనేది, ఈ పిటీషన్ ఎప్పుడు బెంచ్ మీదికి వస్తుందనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇదివరకు తాను రిజర్వ్ లో ఉంచిన తుది తీర్పును వెల్లడించడానికి ముందే- కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం సంచలనంగా మారింది.
ప్రజలందరికీ సమాన న్యాయం..
ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధకం చట్టం-1989 కొన్ని కారణాల వల్ల నీరుగారుతోందని, దీనికి న్యాయ పరంగా మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అంటూ కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ఓ రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది. ఈ క్రమంలో 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది ఆదేశాలను పున:సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను కేంద్రం దాఖలు చేసింది. మే 1వ తేదీన దాఖలైన ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. దాన్ని రిజర్వ్ లో పెట్టింది.దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం ఉంటుందని, సమ న్యాయన్ని వర్తింపజేయాల్సిన బాధ్యత ఉందని అంటూ సుప్రీంకోర్టు అదే రోజు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అప్పటి నుంచీ ఆ పిటీషన్ విచారణకు రాలేదు.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి కేటాయింపు..
ఈ రివ్యూ పిటీషన్ తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన చర్చల్లోకి వచ్చింది. దీన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రెఫర్ చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు యు లలిత్ తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బీఆర్ గావైలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని లేదా సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం తీర్పునే పున:సమీక్షించాలంటూ..
ఇదివరకు సుప్రీంకోర్టు జారీ చేసిన తుది ఆదేశాలను సమూలంగా మార్చేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. ఆ ఆదేశాలు సమస్యలు సృష్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు 2018లో జారీ చేసిన ఆదేశాలను సవరించాల్సిన అవసరం లేదని, రివ్యూ పిటీషన్ ను విచారణకు తీసుకోవాల్సిన పనీ లేదని అంటూ సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, గోపాల్ శంకర్ నారాయణన్ లు ఇదివరకే వాదించారు. గత ఏడాది సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు మద్దతు పలికారు. వాటిని సవరించాల్సిన అవసరం లేదని, రాజ్యాంగంలోని 145 సెక్షన్ కు లోబడే తీర్పు ఉందని చెప్పారు.